కొద్ది నెలల కిందట కంపెనీకి చెందిన మీడియా ఆస్తులను జీ ఎంటర్టైన్మెంట్తో విలీనం చేయాలని (Reliance Zee Merger) ప్రతిపాదించినా, జీ వ్యవస్థాపకుల పాత్ర విషయంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఉప సంహరించుకున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. జీ ఎంటర్టైన్మెంట్ను తిరిగి పుంజుకునేలా రిలయన్స్ చేస్తుందంటూ (Reliance Zee Merger) ఆ గ్రూప్నకు చెందిన అతిపెద్ద వాటాదారు(అమెరికా పెట్టుబడుల కంపెనీ ఇన్వెస్కో) ప్రకటించిన కొద్ది గంటల్లోనే రిలయన్స్ పై విధంగా స్పందించింది.
"ఈ ఏడాది ఫిబ్రవరి/మార్చిలో మా ప్రతినిధులకు, జీ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఎండీ పునీత్ గోయెంకా మధ్య ప్రత్యక్ష చర్చలను ఏర్పాటు చేయడంలో ఇన్వెస్కో సహకరించింది. మా మీడియా ఆస్తులను సరైన విలువ వద్ద జీతో విలీనం చేయాలని అప్పట్లో భావించాం. ఇరు వర్గాలకు మెరుగైన విలువ అందేలా ప్రతిపాదనలు చేశాం. గోయెంకాతో పాటు ప్రస్తుత యాజమాన్యాన్ని కొనసాగించాలని భావించాం. వారికి ఇసాప్స్ (ఎంప్లాయీ స్టాక్ అష్టన్స్) జారీ చేయాలని ప్రతిపాదించాం. ఇన్వెస్కో మాత్రం గోయెంకాను తొలగించాలని కోరింది. గోయెంకా, ఇన్వెస్కోల మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతూనే వచ్చాయి. మేం అందరు వ్యవస్థాపకులను గౌరవిస్తాం. ఎటువంటి ఇబ్బందికర లావాదేవీలను కోరుకోం. అందుకే ఆ ప్రతిపాదన నుంచి విరమించుకుంటున్నాము"
-రిలయన్స్