తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ జాబితాలో రిలయన్స్​కు అగ్రస్థానం!

India's most-visible corporate: ఈ ఏడాది భారత ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించిన కంపెనీల్లో మొదటి స్థానంలో నిలిచింది రిలయన్స్​. ఆదాయం, లాభాలు, మార్కెట్​ విలువ ఇలా అన్నింటిలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది.

By

Published : Dec 21, 2021, 7:54 AM IST

Updated : Dec 21, 2021, 8:26 AM IST

Reliance
రిలయన్స్​

India's most-visible corporate: ఆదాయం, లాభాలు, మార్కెట్‌ విలువ.. ఇలా అన్నిటా దేశీయంగా అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ఈ ఏడాది భారత ప్రసార మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించిన కంపెనీల్లోనూ మొదటి స్థానంలోనే నిలిచింది. ఈ కంపెనీల జాబితాను సిద్ధం చేసిన 'విజికీ న్యూస్‌ స్కోర్‌ రిపోర్ట్‌' ప్రకారం.. 2021 ర్యాంకుల జాబితాలో ఎస్‌బీఐ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌ నిలిచాయి. వార్తల్లో కనిపించే కంపెనీలను గుర్తించేందుకు పరిశ్రమలోనే తొలి ఏకీకృత కొలమానాన్ని విజికీ న్యూస్‌ స్కోర్‌ సిద్ధం చేసింది. వార్తల పరిమాణం, శీర్షికల్లో ప్రాధాన్యం, పబ్లికేషన్లు, పాఠకుల సంఖ్య ఆధారంగా ఈ స్కోరును తయారుచేశారు.

ఎన్‌టీపీసీకి 13వ ర్యాంకు:హెడ్‌ఎఫ్‌సీసీకి ఆరో స్థానం లభించింది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, మారుతీ సుజుకీ, వొడాఫోన్‌ ఐడియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లున్నాయి. ప్రభుత్వ రంగంలో మంచి ర్యాంకు సాధించిన కంపెనీగా ఎన్‌టీపీసీ(13) నిలిచింది. కంపెనీలో అత్యుత్తమ కమ్యూనికేషన్‌ వృత్తినిపుణులున్న భారత బ్రాండ్‌లలో రిలయన్స్‌ కూడా ఒకటని ఇటీవలే ఎక్స్ఛేంజ్‌4మీడియా గ్రూప్‌ గుర్తించిన అనంతరం తాజా ర్యాంకు లభించడం గమనార్హం.

అంతర్జాతీయంగా కూడా..:అంతర్జాతీయం చూస్తే, వార్తల్లో ఫేస్‌బుక్‌ తొలి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత ఆల్ఫాబెట్‌(గూగుల్‌ మాతృ సంస్థ), అమెజాన్‌, యాపిల్‌, శాంసంగ్‌, నెట్‌ఫ్లిక్స్‌, మైక్రోసాఫ్ట్‌లున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అంతర్జాతీయంగానూ ఎనిమిదో ర్యాంక్‌ దక్కింది.

టాప్‌-10 అంకురాలు ఇవీ..:భారత్‌లో ఓలా, డ్రీమ్‌ 11, స్విగ్గీ, ఓయో, ఓలా ఎలక్ట్రిక్‌, భారత్‌ పే, బైజూస్‌, క్రెడ్‌, మొబిక్విక్‌, అన్‌అకాడమీలు 2021 అగ్రశ్రేణి స్టార్టప్‌లుగా నిలిచాయి. తాజా నివేదిక ద్వారా బ్రాండ్లను అర్థం చేసుకునేందుకు వీలవుతుందని విజికీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అన్షూల్‌ సుశీల్‌ పేర్కొన్నారు.

100 మంది టెక్‌ విద్యార్థులకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఉపకార వేతనాలు

అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ టెక్నాలజీ విద్యార్థులు 100 మందికి ఉపకార వేతనాలు అందించనున్నట్లు రిలయన్స్‌ ఫౌండేషన్‌ సోమవారం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏ విద్యా సంస్థలోనైనా కృత్రిమ మేధ, కంప్యూటర్‌ సైన్సెస్‌, మేథమేటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ తొలి ఏడాదిలో చేరిన అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 60 మంది అండర్‌గ్రాడ్యుయేట్‌ విదార్థులు ఒక్కొక్కరికి రూ.4 లక్షల వరకు, 40 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు రూ.6 లక్షల వరకు గ్రాంట్‌ అందుతుందని పేర్కొంది. ఒక కార్పొరేట్‌ ఫౌండేషన్‌ అందిస్తున్న అతి పెద్ద స్కాలర్‌షిప్‌ ఇదే కావడం విశేషం. సామాజిక శ్రేయస్సు కోసం సాంకేతికత వైపు విద్యార్థులను నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిలయన్స్‌ ఫౌండేషన్‌ తెలిపింది. 2021లో 76 మంది యూజీ, పీజీ విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందజేసినట్లు వెల్లడించింది. దేశంలోని తెలివైన విద్యార్థులను వివిధ దశల్లో (ఆన్‌లైన్‌ దరఖాస్తు, దేశీయ, అంతర్జాతీయ నిపుణుల కమిటీతో ఇంటర్వ్యూల అనంతరం) గుర్తించి, ప్రతిభ ఆధారంగా వీటిని అందిస్తామని వివరించింది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ పాఠశాలలు యేటా 14,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి:'నిబంధనల భారాన్ని తగ్గిస్తాం'

Last Updated : Dec 21, 2021, 8:26 AM IST

ABOUT THE AUTHOR

...view details