తెలంగాణ

telangana

ETV Bharat / business

పూర్తిగా నిర్మించిన ప్రాజెక్టుల్లో 100% ఎఫ్‌డీఐ!

పూర్తిగా నిర్మితమైన స్థిరాస్తి ప్రాజెక్టుల్లో 100 శాతం ఎఫ్​డీఐలను అనుమతించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొవిడ్‌-19 సంక్షోభ పరిణామాల కారణంగా ప్రస్తుతం స్థిరాస్తి రంగంలో నిధుల కొరత సమస్య నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సమస్య తీరుతుందని భావిస్తోంది ప్రభుత్వం.

By

Published : Jul 21, 2020, 6:57 AM IST

Realty sector eligible for 100% FDI via automatic route
పూర్తిగా నిర్మించిన ప్రాజెక్టుల్లో 100% ఎఫ్‌డీఐ!

పూర్తిగా నిర్మితమైన స్థిరాస్తి ప్రాజెక్టుల్లో 100 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను స్థిరాస్తి రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) విధానంపై సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌-19 సంక్షోభ పరిణామాల కారణంగా ప్రస్తుతం స్థిరాస్తి రంగంలో నిధుల కొరత సమస్య నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతినిస్తే.. నిధుల కొరత తీరుతుంది. ఈ రంగం పుంజుకునేందుకు కూడా ఈ పరిణామం దోహదం చేస్తుంది. తద్వారా స్థిరాస్తి అభివృద్ధి సంస్థలకూ ఊరట లభించవచ్చని 'ఎకనమిక్‌ టైమ్స్‌' కథనం పేర్కొంది.

గతంలో ఎఫ్​డీఐ విలువ

పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి

స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థల నుంచి ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణాభివృద్ధి రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంపై పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఎఫ్‌డీఐ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. కొన్నింటిలో ఇంకా సడలించాల్సి ఉంది. అందులో ఒకటి స్థిరాస్తి రంగం. అందుకే స్థిరాస్తి రంగంలోనూ నిబంధనలను సడలించి, భారత్‌లో సులువుగా పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గనులతో పాటు మరికొన్ని రంగాల్లో సంస్కరణలకు డీపీఐఐటీ యోచిస్తోంది. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆటోమేటిక్‌ పద్ధతిలో 74 శాతం ఎఫ్‌డీఐకి నిబంధనలను సడలించేందుకు కేంద్ర అనుమతిని తీసుకోవాలని డీపీఐఐటీ భావిస్తోంది. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని ప్రభుత్వం ఇప్పటికే పెంచిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ఇంకా కార్యరూపంలోకి తీసుకొని రావాల్సి ఉంది. కేబినెట్‌ అనుమతులకు సంబంధించి వివరణాత్మక ప్రకటనను త్వరలో డీపీఐఐటీ విడుదల చేయనుంది.

13 శాతం

13% పెరిగిన ఎఫ్‌డీఐ

టౌన్‌షిప్‌లు, నివాస, వాణిజ్య సముదాయాలు, రహదారులు, వంతెనలు, హోటళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, నగర, ప్రాంత స్థాయి మౌలిక సదుపాయాలు లాంటి నిర్మాణ అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఆటోమేటిక్‌ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐని ప్రస్తుతం ప్రభుత్వం అనుమతినిస్తోంది. అయితే ఇందుకు మూడేళ్లపాటు లాక్‌ఇన్‌ పీరియడ్‌ లాంటి షరతులను పెట్టుబడి సంస్థలు పాటించాల్సి ఉంటుంది. మరోవైపు స్థిరాస్తి వ్యాపారం లేదా ఫామ్‌ హౌస్‌ల నిర్మాణంలో ఎఫ్‌డీఐకి అనుమతిలేదు. గత ఆర్థిక సంవత్సరం (2019-20) నిర్మాణాభివృద్ధి రంగంలోకి 617 మిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐ వచ్చింది. 2018-19లో నమోదైన 213 మిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. పన్నుల వసూళ్లు, పెట్టుబడుల ఉపసంహరణ మార్గం ద్వారా నిధుల సమీకరణ పుంజుకునే అవకాశం లేనందున.. వ్యవస్థలో ద్రవ్యలభ్యత పుంజుకునేందుకు, ఆర్థిక ప్రగతి వేగంగా ముందుకు వెళ్లేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రమే ఏకైక మార్గమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఎఫ్‌డీఐ విస్తృతిని పెంచాల్సిందిగా స్థిరాస్తి పరిశ్రమ చాన్నాళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతోంది. వీటన్నింటి దృష్ట్యా ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇదీ చూడండి:ఇండిగోలో 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన

ABOUT THE AUTHOR

...view details