తెలంగాణ

telangana

By

Published : Oct 3, 2020, 12:30 PM IST

ETV Bharat / business

రుణగ్రహీతలకు కేంద్రం భారీ ఊరట!

రుణాలపై మారటోరియానికి సంబంధించిన చక్రవడ్డీ విషయంలో రుణగ్రహీతలకు పెద్ద ఊరట. వడ్డీపై వడ్డీని వదులుకునేందుకు సిద్ధమని సుప్రీంకోర్టులో అఫిడవిట్​ దాఖలు చేసింది కేంద్రం. 6 నెలల్లో 2 కోట్ల రూపాయల వరకు ఉన్న రుణాలపై వడ్డీ వదులుకుంటామని తెలిపింది.

ready to waive off the compound interest
రుణగ్రహీతలకు కేంద్రం భారీ ఊరట!

వివిధ రుణాలపై మారటోరియం సమయంలో చెల్లించాల్సిన వడ్డీ విషయంలో కేంద్రం రుణగ్రహీతలకు ఊరటనిచ్చింది. వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. రుణగ్రహీతలకు మారటోరియం ఫలాలు అందాలంటే వడ్డీ భారం భరించడం తప్ప ఇంకో పరిష్కార మార్గం లేదని ఈ సందర్భంగా కేంద్రం అభిప్రాయపడింది.

మారటోరియం వ్యవధి అయిన మార్చి నుంచి ఆగస్టు వరకు ఈ మాఫీ వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. రూ.రెండు కోట్ల వరకు ఉన్న రుణాలపై ఈ ఆరు నెలల కాలంలో విధించే వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత, గృహ, విద్య, వాహన, వినియోగ వస్తువులపై తీసుకున్న రుణాలతో పాటు క్రెడిట్‌ కార్డు బకాయిలకు ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది.

అన్ని రకాల రుణాలపై వడ్డీ చెల్లిస్తే కేంద్రంపై రూ.ఆరు లక్షల కోట్ల భారం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందని.. బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రుణాలు.. అదీ రూ.రెండు కోట్ల వరకు ఉన్న వాటిపై మాత్రమే వడ్డీపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

మారటోరియం కాలంలో వాయిదాలు చెల్లించిన వారికి కూడా ఈ ప్రయోజనాన్ని అందిస్తామని చెప్పింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిధుల కేటాయింపు కోసం పార్లమెంటు అనుమతి తీసుకుంటామని పేర్కొంది.

కాగ్ సిఫార్సుతో వైఖరిలో మార్పు

బ్యాంకు రుణాలపై మారటోరియం కాలంలో విధించే వడ్డీపై వడ్డీ మాఫీ చేయడం సాధ్యం కాదని.. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహా భారత ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు విన్నవించాయి. అయితే, మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ రాజీవ్‌ మెహ్రిషీ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫార్సుల నేపథ్యంలో సర్కార్‌ తన వైఖరిని మార్చుకుంది. వివిధ రంగాలపై కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ప్రభావంపై ఈ కమిటీ అధ్యయనం చేసింది.

సోమవారం విచారణ

కరోనాతో ఆదాయాలు తగ్గిన వారికి ఉపశమనం కల్గించేందుకు ఆర్బీఐ మారటోరియం వసతి కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యవధిలో రుణాలపై వడ్డీ వసూలు చేయడం, ఆ వడ్డీపై వడ్డీ విధించడం వల్ల లాభమేమీ ఉండదని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార‌టోరియం వ‌ల్ల రుణాలు చెల్లించే కాల‌ప‌రిమితి మాత్రమే పెరుగుతుంద‌ని, వ‌డ్డీ మాత్రం చెల్లించాల్సిందేనని గతంలో ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తెలపాలని గతంలో పలుసార్లు సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆర్బీఐతో చర్చించి రుణగ్రహీతలకు మారటోరియం ప్రయోజనాలు అందేలా చూడాలని స్పష్టం చేసింది. ఆ దిశగా తీసుకునే చర్యలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలంది. ఈ మేరకు కేంద్రం తాజాగా తమ అభిప్రాయాల్ని కోర్టు ముందుంచింది. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details