మనదేశం నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో 1531.06 మిలియన్ డాలర్ల (సుమారు రూ.11,500 కోట్ల) విలువైన మందులు ఎగుమతి చేశాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో దీన్నొక రికార్డుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇంత సంక్షోభంలోనూ దేశీయ ఔషధ కంపెనీలు సత్తా చాటాయని ఫార్మాగ్జిల్ (ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్) డైరెక్టర్ జనరల్ ఆర్.ఉదయ భాస్కర్ విశ్లేషించారు. 2019 ఏప్రిల్ ఎగుమతులతో పోల్చితే, ఈసారి 0.25 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవన్నీ జోరుగా..
ఏఆర్వీ (యాంటీ-రెట్రోవైరల్) ఔషధాలు, కేన్సర్ మందులకు తోడు యాంటీ-బయాటిక్స్, పారాసెట్మాల్, క్లోరోక్విన్ తదితర ఔషధాలను మనదేశం నుంచి ఇతరదేశాలు పెద్దఎత్తున కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఏప్రిల్లో ఔషధ ఎగుమతులు మెరుగ్గా నమోదైనట్లు సమాచారం.
ఈ దేశాలకు
అమెరికా, బ్రెజిల్, ఐరోపా, ఆఫ్రికా దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్ (హెచ్సీక్యూ), క్లోరోక్విన్ ఫాస్పేట్, అజిత్రోమైసిన్, అమాక్సలిన్, పారాసెట్మాల్.. ఔషధాలను అధికంగా మనదేశం నుంచి తీసుకున్నాయి. క్లోరోక్విన్ మలేరియా వ్యాధిని అదుపు చేసేందుకు ఉద్దేశించిన మందు అయినప్పటికీ, దానికి కరోనా వైరస్ వ్యాధి రాకుండా నిరోధించే గుణం ఉన్నట్లు, వచ్చిన వారు సైతం త్వరగా కోలుకునేందుకు వీలుకల్పిస్తుందనే అభిప్రాయం ఏర్పడటంతో పలు దేశాలు ఈ ఔషధాన్ని పెద్దఎత్తున కొనుగోలు చేశాయి. దాదాపు 150కి పైగా దేశాలకు క్లోరోక్విన్ను ఎగుమతి చేశామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కరోనా వ్యాక్సిన్/ఔషధమైనా మన దగ్గరే తయారీ
ఔషధ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో బాగానే ఉంటాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాధికి వ్యాక్సిన్ కానీ, తగిన మందు కానీ కనుగొంటే, దాన్ని వెంటనే మనదేశంలో తయారు చేసి ఇతర దేశాలకు అందజేసే అవకాశం కోసం ఇక్కడి ఫార్మా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. అటువంటిదేదైనా జరిగితే ఔషధ ఎగుమతులు ఇంకా పెంచుకోవచ్చు.