ఫిన్టెక్ దిగ్గజం, ప్రముఖ పేమెంట్ సంస్థ పేటీఎం(Paytm).. తమ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 'బై నౌ పే లేటర్(బీఎన్పీఎల్)' సేవల్లో భాగంగా 'పోస్ట్పెయిడ్ మినీ'(Paytm postpaid mini) పేరుతో కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా నెలవారీ ఇంటి ఖర్చుల కోసం.. ఇన్స్టంట్ లోన్ సౌకర్యం లభించనుంది. ఈ సేవలను బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ప్రారంభించింది పేటీఎం. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత ఇన్స్టంట్ క్రెడిట్ 'పేటీఎం పోస్ట్పెయిడ్'కు ఇది అదనం.
కొత్త ఆఫర్ ఇలా..
ఈ కొత్త సేవల ద్వారా పేటీఎం వినియోగదారులు రూ.250 నుంచి రూ.1000 వరకు నెలనెలా రుణం పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ ఆఫర్ రోజువారీ ఖర్చులతో పాటు మొబైల్, డీటీహెచ్ రీఛార్జులు, గ్యాస్ సిలిండర్ బుకింగ్, విద్యుత్తు, నీటి బిల్లుల వంటి నెలవారీ ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడతుందని పేటీఎం పేర్కొంది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా రుణాలు పొందితే 30 రోజుల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల కాలానికి ఎలాంటి వడ్డీ ఉండదు. అలాగే.. ఎలాంటి యాక్టివేషన్ ఛార్జీలు, వార్షిక ఫీజులు, కనీస నగదు నిల్వ కూడా అవసరం లేదని స్పష్టం చేసింది పేటీఎం.