తెలంగాణ

telangana

By

Published : Jul 26, 2021, 7:55 PM IST

ETV Bharat / business

'అందుకోసం కరెన్సీ నోట్లను ముద్రించేది లేదు'

కరోనా వల్ల దేశంలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి కరెన్సీ నోట్లను ముద్రించాలన్న వాదనలను కొట్టిపడేసింది కేంద్రం. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనల్లో ప్రభుత్వం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​సభ వేదికగా వెల్లడించారు.

Finance Minister nimala seetharaman
నిర్మలా సీతా రామన్​

కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను ముద్రించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి భారీగా కరెన్సీని ముద్రించే ప్రణాళికేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ లోక్​ సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు.

మరిన్ని వివరాలు..

2020-21లో దేశ వాస్తవిక జీడీపీ అంచనా -7.3 శాతంగా ఉన్నట్లు నిర్మలా సీతారామన్​ తెలిపారు. వృద్ధి రేటులో ఈ క్షీణత.. కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు.. దానిని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సంక్షోభంలోనూ దేశ ఆర్థిక మూలాలు స్థిరంగా ఉన్నట్లు మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ 2020-21లో రెండో అర్ధ భాగం నుంచి రికవరీ బాటలో పయనించేందుకు ఆత్మనిర్భర్​ భారత్​ మిషన్ ఎంతగానో తోడ్పడిందని వెల్లడించారు.

భారీ ప్యాకేజీ..

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ఉద్యోగ కల్పన వంటి వాటికోసం.. 2020-21లో ఆత్మ నిర్భర్​ భారత్ మిషన్​ కింద.. రూ.29.87 లక్షల కోట్లతో కేంద్రం ప్రత్యేక , సమగ్ర ప్యాకేజీని ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్​ గుర్తు చేశారు.

విస్తృత, సమగ్ర ఆర్థికాభివృద్ధికోసం.. 2021-22 కేంద్ర బడ్జెట్​లోనూ.. భారీగా నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తన సమాధానంలో వివరించారు. ఇందులో భాగాంగా మూలధన వ్యయాలకు 34.5 శాతం, ఆరోగ్య రంగ వ్యయాలను 137 శాతం పెంచినట్లు తెలిపారు.

ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి, వృద్ధికి ఊతమందించేందుకు, ఉద్యోగకల్పనకు గానూ.. ఈ ఏడాది జూన్​లో రూ.6.29 లక్షల కోట్లతో ప్రత్యేక ఉపశమన ప్యాకేజీని ప్రకటించినట్లు సీతారామన్​ తెలిపారు

ఇదీ చూడండి:కేంద్రం కీలక నిర్ణయం- తగ్గనున్న పప్పుల ధరలు!

ABOUT THE AUTHOR

...view details