దేశంలో లాక్డౌన్ విధించాక, వంటగ్యాస్ సిలెండర్ల బుకింగ్ పెరిగిందని, అందుకు తగ్గట్లే రోజువారీ సగటు సరఫరా 35-40 శాతం పెరిగిందని అంటున్నాయి ఇంధన కంపెనీలు. తక్కువ సిబ్బందితోనే ఇంత అందిస్తున్నట్లు ఆయా కంపెనీలు తెలిపాయి. వంటగ్యాస్, పెట్రోల్ వంటి ఇంధనాల కొరతే లేదంటున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా లాక్డౌన్ ప్రకటించినందున, వంటగ్యాస్కు కొరత వస్తుందనే ఆందోళనతో ప్రజలు అధికంగా సిలెండర్లు బుక్ చేస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఈ భరోసా ఇచ్చాయి. సిబ్బంది కొరత వల్ల లాక్డౌన్ ప్రకటించిన మొదట్లో కాస్త ఇబ్బంది ఎదురైందని, ఇప్పుడు పరిస్థితి సజావుగా ఉందని తెలిపాయి.
15 లక్షల సిలెండర్లు..
వంటగ్యాస్పై ఆందోళనే వద్దని హెచ్పీసీఎల్ ఎండీ ముకేశ్ కుమార్ సురానా వెల్లడించారు. రోజుకు గతంలో 12 లక్షల సిలెండర్లు సరఫరా చేసేవారమని, ఇప్పుడు 15 లక్షలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. డెలివరీ సిబ్బందికి కూడా మాస్క్లు, శానిటైజర్లు అందించామని, గుంపుగా ఉండొద్దని సూచించినట్లు వివరించారు.
ఇళ్లకు వారే తీసుకెళ్తున్నారని, సొసైటీల్లో గనుక లోపలకు తేవద్దంటే, గేటు దగ్గర దించి వెళ్తారని తెలిపారు. కొన్ని సొసైటీల వద్ద డెలివరీ తీసుకోవడం లేదనీ తెలిపారు. బీపీసీఎల్, ఐఓసీ కూడా ఇదేరకమైన భరోసా కల్పించాయి. పెట్రోలియం ఉత్పత్తులన్నీ దేశీయ అవసరాలకు సరిపడా ఉన్నట్లు ఐఓసీ ఛైర్మన్ స్పష్టం చేశారు.