తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆ యాప్​తో సొంతూళ్లలోనే వలస కూలీలకు ఉపాధి!

కరోనా లాక్​డౌన్​లో ఉపాధి కోల్పోయిన వలస కూలీల కోసం నీతి ఆయోగ్​ నేతృత్వంలో అత్యున్నత కమిటీ ఏర్పాటైనట్లు తెలుస్తోంది. సొంత రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ ద్వారా వీరికి ఉపాధి కల్పించాలని ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పూర్తి సమాచారం అందరికీ అందుబాటులో ఉండేలా ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి ఓ మొబైల్​ యాప్​ తీసుకురానున్నట్లు వెల్లడించాయి.

By

Published : Jun 20, 2020, 12:09 PM IST

BIZ-LABOUR-JOBS
నీతి ఆయోగ్​

వలస కార్మికుల కోసం ఉద్యోగ వేదికను అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్​ ప్రత్యేక ప్యానెల్​ ఏర్పాటు చేసింది. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ సాంకేతిక సంస్థల ప్రతినిధులు ఉన్నట్లు ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన వర్గాలు తెలిపాయి.

"నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్​ కాంత్​ నేతృత్వంలో అత్యున్నత కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో దీని కార్యాచరణ ఉంటుంది. ప్రస్తుత సంక్షోభాన్ని తొలగించి వలస కూలీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే సాంకేతికత అభివృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ కృషి చేస్తోంది."

- పరిశ్రమ వర్గాల సమాచారం

సొంత రాష్ట్రంలోనే అవకాశాలు..

కరోనా సంక్షోభం కారణంగా లక్షలాది మంది బ్లూకాలర్ కార్మికులు సొంతూళ్లకు వెళ్లారు. అక్కడా ఎలాంటి ఉపాధి లేకుండానే జీవిస్తున్నారు. సొంత రాష్ట్రంలోనే వలస కూలీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్ట్​ను ప్రారంభించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇందులో ఉద్యోగార్థులు, యాజమాన్యాలు, ప్రభుత్వ ఏజెన్సీలు, నైపుణ్య కేంద్రాలను అనుసంధానం చేస్తారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్​ను కూడా భాగం చేయనున్నట్లు తెలుస్తోంది.

అప్లికేషన్​ సాయంతో..

భారత జీడీపీలో 30 శాతం ఉన్న అసంఘటిత రంగంలో 40 కోట్ల మంది కార్మికులు ఉన్నారని అంచనా. ఇందులో 60 శాతం మంది వలసకూలీలే. ప్రస్తుతం వీరికి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య శిక్షణ అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం.

ఇందుకోసం ఫీచర్​ ఫోన్లలోనూ పనిచేసే యాప్​ను అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది. వివిధ భాషల్లో పనిచేసే ఈ అప్లికేషన్​తో నైపుణ్య శిక్షణ కేంద్రాలు, స్థానికత ఆధార ఉద్యోగాలను గుర్తించవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్త హెల్ప్​లైన్​ నంబర్​ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

వ్యాపార ప్రముఖులు..

ఈ ప్యానెల్​లో రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ప్రెసిడెంట్​ కిరణ్ థామస్, మైక్రోసాఫ్ట్ ఇండియా అధ్యక్షుడు అనంత్ మహేశ్వరి, టెక్​ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాణి, గూగుల్​ ఇండియా మేనేజర్​ సంజయ్ గుప్తా, భారతి ఎయిర్​టెల్​ సీఈఓ గోపాల్ విఠల్​ వంటి ప్రముఖులు ఉన్నారు. ఎంఎస్​ఎంఈ కార్యదర్శి ఏకే శర్మ కూడా ఈ ప్రాజెక్టులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:వలస కమిషన్‌తో కష్టాలు తీరేనా..?

ABOUT THE AUTHOR

...view details