తెలంగాణ

telangana

ETV Bharat / business

ట్విట్టర్ కొత్త సీఈఓగా భారతీయుడు.. ఎవరీ పరాగ్ అగర్వాల్​..? - పరాగ్‌ అగర్వాల్‌ ఏ రాష్ట్రానికి చెందినవాడు

ట్విట్టర్ సీఈఓగా రాజీనామా చేసిన ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ స్థానంలో భారతీయుడైన పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. అయితే రాజీనామా చేసినప్పటికీ.. డోర్సీ బోర్డులో కొనసాగుతారని ట్విట్టర్ స్పష్టం చేసింది.

PARAG
పరాగ్

By

Published : Nov 30, 2021, 5:35 AM IST

Updated : Nov 30, 2021, 7:30 AM IST

సామాజిక మాధ్యమం ట్విట్టర్​కు కొత్త సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా భారత సంతతికి చెందిన పరాగ్‌ అగర్వాల్‌ (45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌(సీటీఓ)గా ఉన్నారు.

ఇదో గౌరవం..

ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చదువుకున్నారు. తాజా నియామకంపై స్పందించిన ఆయన ‘ఈ పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తా’నని పేర్కొన్నారు. డోర్సీకు కృతజ్ఞతలు చెప్పారు. 'మీ మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరాగ్‌ను ఈ స్థానంలో నిలబెట్టడానికి మూడు కారణాలున్నాయని డోర్సీ అన్నారు.

"కొత్త సీఈఓ కోసం బోర్డు చాలా తీవ్రంగా వెతికింది. చివరకు పరాగ్‌ను ఏకగ్రీవంగా ఎంచుకుంది. అయితే కొంత కాలంగా నా ఎంపిక కూడా అతడే. ఎందుకంటే కంపెనీని, కంపెనీ అవసరాలను అతను లోతుగా అర్థం చేసుకున్నాడు. ప్రతి కీలక నిర్ణయం వెనక పరాగ్‌ ఉన్నారు. ఈ కంపెనీ ఇలా మారడానికి కారణమయ్యారు. అంతే కాదు.. ఆసక్తి, హేతుబద్ధత, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయి. మనసు పెట్టి పనిచేస్తారు. మా సీఈఓగా నాకు అతనిపై పూర్తి విశ్వాసం ఉంది"

--డోర్సీ

సవాళ్లు.. గెలుపోటములు..

2011లో అగర్వాల్‌ ట్విట్టర్​లో చేరారు. అపుడు 1000 మంది కంటే తక్కువ ఉద్యోగులున్న సంస్థ అది. 2017 నుంచి సీటీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

"పదేళ్లు గడిచిపోయినా.. నాకు నిన్నటిలాగే ఉంది. ఎత్తుపల్లాలు, సవాళ్లు, గెలుపులు, ఓటములు.. అన్నీ చూశాను. అయితే అప్పటికి.. ఇప్పటికీ ట్విట్టర్‌ ప్రభావం అద్భుతంగా మారింది. మా ప్రగతి కొనసాగిస్తాం. మా ముందు గొప్ప అవకాశాలెన్నో ఉన్నాయి. మా లక్ష్యాలను చేరడానికి ఇటీవలే వ్యూహాలను మెరుగుపరచుకున్నాం. మా వినియోగదార్లకు, వాటాదార్లకు.. అందరికీ అత్యుత్తమ ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంటాం"

--పరాగ్ అగర్వాల్

డోర్సీ ఎందుకు వెళ్లారంటే..

కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్న సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ తన నిష్క్రమణపై ట్విట్టర్​లో ఓ పోస్ట్ పెట్టారు. 'పదహారేళ్ల పాటు కంపెనీలో సహ వ్యవస్థాపకుడి నుంచి సీఈఓగా, సీఈఓ నుంచి ఛైర్మన్‌.. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా; ఆ తర్వాత తాత్కాలిక సీఈఓ, సీఈఓగా.. ఇలా యాత్ర సాగింది. ఇపుడు బయటకెళ్లాలని నిర్ణయించుకున్నా..' అని అందులో పేర్కొన్నారు. 'వ్యవస్థాపక నాయకత్వంలోనే ఓ కంపెనీ ఉండాలంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ వాదనతో నేను ఏకీభవించను. సంస్థ వైఫల్యానికి అదీ ఓ కారణమవుతుందని విశ్వసిస్తా. కంపెనీ పునాదులు, వ్యవస్థాపకుల నుంచి కంపెనీ బయటకు రావడానికి చాలా కష్టపడ్డా' అని రాసుకొచ్చారు.

టిట్టర్​ షేర్లు రయ్ రయ్..

అయితే.. డోర్సీ స్థాపించిన ఆర్థిక చెల్లింపుల కంపెనీ స్వ్కేర్‌కు ప్రస్తుతం డోర్సీ సీఈఓగా కొనసాగుతున్నారు. దీనితో రెండు కంపెనీలను సమర్థంగా ఎలా నిర్వహించగలరని 'స్వ్కేర్‌' కంపెనీలోని కొందరు పెద్ద పెట్టుబడుదార్లు బహిరంగంగా ప్రశ్నించారు. అదీగాక అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ ట్విట్టర్‌ ఖాతా నిషేధించిన సమయంలోనూ డోర్సీపై విమర్శలొచ్చాయి. 2022లో పదవీ కాలం ముగిసేంత వరకు బోర్డులో డోర్సీ కొనసాగనున్నారు. ఆయన రాజీనామాతో ట్విట్టర్‌ షేర్లు సోమవారం ప్రారంభ గంటలో 10 శాతం పైగా లాభాలు పొందడం గమనార్హం.

ఇవీ చదవండి:

Last Updated : Nov 30, 2021, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details