సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన ఓ తప్పుడు సమాచారం... కేరళలోని మున్నార్ తపాలా కార్యాలయం ముందు స్థానిక జనాలు బారులు తీరేలా చేసింది. తపాలా కార్యాలయంలో నూతన ఖాతా తెరిస్తే ప్రధానమంత్రి ఖాతా నుంచి నేరుగా డబ్బులు జమవుతాయన్న తప్పుడు సందేశం ప్రచారం కావడమే ఇందుకు నేపథ్యం.
గత కొన్ని రోజులుగా స్థానికులు మున్నార్ తపాలా కార్యాలయం ముందు బారులు తీరుతున్నారు. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రజలు నమ్మడం లేదు. వందలాదిగా జనం బారులు తీరడం వల్ల పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.