జీవిత బీమా, ఆరోగ్య బీమాల గురించి 'ఈటీవీ భారత్'తో మ్యాక్స్లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రశాంత్ త్రిపాఠి పంచుకున్న విశేషాలు ఇవే..
కొవిడ్-19 మహమ్మారి జీవిత బీమా రంగంపై ఎలాంటి ప్రభావం చూపించింది ?
కొవిడ్-19 మనందరికీ 'సంసిద్ధత' అవసరాన్ని తెలియజేసిందని చెప్పుకోవచ్చు. లాక్డౌన్ అమలు తొలినాళ్లలో బీమా పరిశ్రమ ఇబ్బంది పడింది. తొలి ప్రీమియం వసూళ్లలో క్షీణత కనిపించింది. ఆ తర్వాత జీవిత బీమా సంస్థలు డిజిటల్ వైపు దృష్టి సారించాయి. బీమా పాలసీల్లో డిజిటల్ విక్రయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా స్పష్టంగా తెలియజేసింది. ఈ 'కొత్త సాధారణ' జీవితంలో సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవడంపైన బీమా సంస్థలు దృష్టి నిలపాల్సిన పరిస్థితి. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ విషయంలో ముందు నుంచీ జాగ్రత్తలు తీసుకుంది. మా పాలసీదారులకు ఇబ్బంది కలగకుండా డిజిటల్ ఛానెళ్లను పటిష్ఠం చేశాం. పాలసీల విక్రయాలు, పాలసీ జారీ, క్లెయిం, సేవలన్నీ డిజిటల్ రూపంలోనే అందిస్తున్నాం. బీమా సలహాదార్లకూ పాలసీలు విక్రయించేందుకు డిజిటల్ సాంకేతికతను అందించాం.
జీవిత, ఆరోగ్య బీమా పాలసీదారులు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకునే దిశగా బీమా సంస్థలు ప్రోత్సహించాలని ఐఆర్డీఏ సూచించింది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
ఐఆర్డీఏఐ జారీ చేసిన మార్గదర్శకాలు బీమా సంస్థలకూ, పాలసీదారులకూ మేలు చేసేవే. బీమా సంస్థలు పాలసీదారులలో ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించాలి. పాలసీదారులు నిరంతరం బీమా సంస్థలతో అనుసంధానం అయ్యేలా ఇది వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియలో సేకరించిన సమాచారం ఆధారంగా వారికి మరింత మేలైన ఉత్పత్తులను అందించేందుకు ఉపయోగపడుతుంది. పాలసీదారులు ఆరోగ్యకరమైన జీవనాన్ని గడిపినప్పుడు బీమా సంస్థలకు తక్కువ క్లెయింలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఆ ప్రయోజనాల్ని అంతిమంగా పాలసీదారులతో పంచుకుంటాయి. ఫలితంగా వారికి ప్రీమియంలో రాయితీ లభిస్తుంది. ఈ దిశగా బీమా సంస్థలు మరింత కృషి చేస్తున్నాయి. ఇప్పటికే పలు బీమా సంస్థలు దీనికోసం ప్రత్యేక యాప్లనూ తీసుకొచ్చాయి. మేమూ ఇలాంటి యాప్ను అందుబాటులోకి తెచ్చాం.
దీర్ఘకాలంలో బీమా పరిశ్రమ పనితీరును ఎలా విశ్లేషిస్తారు?
వచ్చే దశాబ్ద కాలంలో బీమా పరిశ్రమ 12-15 శాతం వరకూ వృద్ధి చెందుతుందని అంచనా. ప్రస్తుతం కొవిడ్-19 మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది. ఫలితంగా రక్షణ, రాబడి హామీతో ఉన్న పథకాలకు ఆదరణ పెరిగింది. ఈ ధోరణి భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశముంది. బీమా రంగం నిర్మాణాత్మక వృద్ధిలో మధ్య తరగతి, చిన్న కుటుంబాలు, యువ జనాభా తోడ్పడతాయి. కరోనా తర్వాత బీమా సంస్థలు వినూత్న ఆవిష్కరణల అవసరాన్ని గుర్తించాయి. తమ ఉద్యోగులు, సలహాదార్లలో నైపుణ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక అవసరాలకు ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చేందుకు ఐఆర్డీఏఐ కృషి చేస్తోంది. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ.. పాలసీదారులకు విలువ ఆధారిత పాలసీలను అందించేందుకు బీమా సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇవన్నీ దీర్ఘకాలంలో బీమా పరిశ్రమకు మేలు చేసేవే. రాబోయే కాలంలో యాన్యుటీ పాలసీల విభాగం వృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యక్తుల జీవిత కాలం పెరగడంతో వారు.. పదవీ విరమణ తర్వాత అవసరాలకు ఈ తరహా పథకాలపైనే దృష్టి సారిస్తారు.