దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. ప్రీమియం హ్యాచ్బ్యాక్ మోడల్ సెలెరియో కొత్త వెర్షన్ను విడుదల చేసింది. దీని ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.94 లక్షల మధ్య ఉండనుంది. ఇంధన సామర్థ్యంలో దేశంలోనే ఉత్తమమైన పెట్రోల్ కారుగా సెలెరియోనూ అభివర్ణించిన కంపెనీ.. ఈ విభాగంలో అత్యధిక మార్కెట్ వాటాను కైవసం చేసుకోవడమే లక్ష్యమని పేర్కొంది. సెలెరియో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది.
- మాన్యువల్ గేర్బాక్స్ వేరియంట్ ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.44 లక్షల మధ్య ఉంటుంది.
- ఆటో గేర్ షిఫ్ట్ వేరియంట్ ధర రూ.6.13 లక్షల నుంచి రూ.6.94 లక్షల మధ్య ఉండనుంది. సెలెరియో లాంఛింగ్ ఈవెంట్
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న సెలెరియో మోడల్ కంటే ఇది మరింత విశాలంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇంధన సామర్థ్యం 15-23 శాతం మెరుగైనట్లు పేర్కొంది. సౌకర్యవంతమైన ఫీచర్లతో పాటు.. భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపింది. 999సీసీ-కే 10సీ ఇంజిన్ను అమర్చినట్లు పేర్కొన్న కంపెనీ.. లీటరుకు 26.68 కి.మీల మైలేజీ దీని సొంతమని తెలిపింది.
'మారుతీకి గర్వకారణం..'
భారతీయ కార్ మార్కెట్లో హ్యాచ్బ్యాక్ల వాటా దాదాపు 46 శాతంగా ఉంది. 'ఈ నేపథ్యంలో దేశీయ వినియోగదారులకు తమ ఉత్తమ మోడల్ అయిన సెలెరియోను అందించాలని నిర్ణయించినట్లు మారుతీ సుజుకీ ఎండీ, సీఈఓ కెనిచీ అయుకవా పేర్కొన్నారు. అలాగే.. 'ప్రపంచంలో ఐదో అతిపెద్ద కార్ మార్కెట్గా ఉన్న భారత్లో.. సగానికి పైగా కార్లను తమ సంస్థ అందించడం గర్వకారణమని' చెప్పారు.
భవిష్యత్లో కాలుష్య ఉద్గారాలను తగ్గించి, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరిచే సాంకేతికతల్లో పెట్టుబడులు కొనసాగుతాయని అయుకవా తెలిపారు. ఇక లాభాల క్షీణతపై మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ చిప్ల కొరత, ముడిపదార్థాల ధరల పెరుగుదల కారణంగా రెండో త్రైమాసికంలో లాభాలు క్షీణించడం కంపెనీకి సవాలుగా మారిందన్నారు.
"ఉత్పత్తి విషయంలో ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంది. సవాళ్లున్నప్పటికీ దీర్ఘకాలికంగా ఆశాజనకంగా ఉంటూ క్రమంగా ముందుకు సాగుతాం. దేశంలో చేపడుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవడం, యువతలో పెరుగుతున్న ఆకాంక్షలతో మార్కెట్ త్వరగా కోలుకుంటుదని భావిస్తున్నాం."
-అయుకావా
ఇక.. దేశవ్యాప్తంగా చేపట్టిన మౌలిక సదుపాయాల విస్తరణతో అనుసంధానం పెరుగుతుందని.. ఫలితంగా భారతీయ కార్ మార్కెట్ మంచి వృద్ధిని నమోదుచేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సెమీకండక్టర్ చిప్ల కొరత అనేది ప్రపంచ సమస్య అని.. త్వరలోనే పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు.