మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇదే తేదీ అనేక ఆర్థిక కార్యకలాపాలకు ఆఖరి గడువుగా ఉంది. కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా కేంద్రం తీసుకువచ్చిన ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) నగదు ఓచర్ల పథకానికీ ఈ నెల 31 ఆఖరు తేదీ. ఈలోగా అర్హులంతా జీఎస్టీ నంబర్లను, సంబంధిత రసీదులను సమర్పించాలని సూచిస్తున్నారు నిపుణులు.
లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) అంటే ఏంటి?
కరోనా కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే దిశగా గతేడాది అక్టోబర్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్లో డిమాండ్ పెంచేందుకు ఉద్యోగులకు ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) నగదు ఓచర్లును ప్రకటించింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగేళ్లకు ఒక సారి విహార యాత్రలకు, సొంతూళ్లకు వెళ్లేందుకు ఎల్టీసీ తీసుకునే వీలుంటుంది. అయితే సారి ప్రయాణాలు కష్టతరమైనందున.. ఎల్టీసీకి బదులు అంతే మొత్తానికి సమానమైన పన్ను వర్తించని నగదు ఓచర్లు ఉద్యోగులకు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఈ పథకాన్ని ఉపయోగించేందుకు ఓ ఉద్యోగి లీవ్ ఎన్క్యాష్మెంట్కు సమానమైన మొత్తానికి వస్తులు, సేవలను కొనుగోలు చేయాలి. ఈ ఖర్చు ఎల్టీసీ ఛార్జీలకు నిర్దేశించిన నిష్పత్తిలోనే ఉండాలి. దీంతో పాటు 12 శాతం అంతకన్నా ఎక్కువ జీఎస్టీ వర్తించే వస్తులు, సేవలను కొనుగోలు చేయడం అనే షరతు కూడా ఉంది. ఈ మొత్తాన్ని మార్చి 31లోపు డిజిటల్ మోడ్లో ఖర్చు చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు సదరు ఉద్యోగి జీఎస్టీ సంఖ్యను, సంబంధిత రసీదులను జత చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ పథకానికి మీరు అర్హులా? చెక్ చేసుకోండిలా..
- కొత్త పన్ను విధానం కింద ఉన్న ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. ఎందుకంటే ఈ విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా మరిన్ని తగ్గింపులు, మినహాయింపులు ఉంటాయి.
- ప్రస్తుతం ఉన్న 2018-21 కాలానికి గానూ ఎల్టీసీ మినహాయింపు ఉపయోగించుకున్న వారు ఇందుకు అర్హులు కారు. ఈ నాలుగేళ్లలో ఎల్టీఏను కేవలం రెండు ప్రయాణాలకు మించి ఉయోగించి ఉండకూడదు.
- ఈ పథకాన్ని ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే తీసుకొచ్చిన కేంద్రం.. తరువాత ప్రైవేటురంగంలోని ఉద్యోగులకూ వర్తింపచేసింది.
- ఈ పథకం కింద ఉద్యోగులు లబ్ధిపొందడానికి అక్టోబర్ 12 నుంచి మార్చి 31 మధ్య కొనుగోలు చేసిన బిల్లులను నిర్ణీత గడువులోగా సమర్పించాలి.
- ఓ ఉద్యోగి ఖర్చు చేసిన మొత్తం ఎల్టీసీ పేర్కొన్న దానికి మూడు రెట్లకు సమానంగా ఉండాలి. 12 శాతం అంతకన్నా ఎక్కువ జీఎస్టీ వర్తించే వస్తులు, సేవలను కొనుగోలు చేసుండాలి. ఆ లావాదేవీలు కచ్చితంగా డిజిటల్ మోడ్లోని జరిగి ఉండాలి.
పైన పేర్కొన్న షరతులను పాటించి ఉన్నట్లైతే.. మీరు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందగలరు.
ఇదీ చూడండి:బీమా ప్రీమియంకు ఎల్టీసీ క్యాష్ ఓచర్ వర్తింపు