హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న కిమ్స్ హాస్పిటల్స్ (కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లిమిటెడ్) పెద్దఎత్తున విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే అయిదేళ్లలో 5,000 ఆస్పత్రి పడకల సామర్థ్యానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం రూ.1500 కోట్ల వరకు పెట్టుబడి అవసరం. కొన్ని ఆస్పత్రులను కొనుగోలు చేయటం సహా మరికొన్ని కొత్త ఆస్పత్రులు నెలకొల్పడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ బి.భాస్కరరావు 'ఈటీవీ భారత్'కు వెల్లడించారు.
కిమ్స్ హాస్పిటల్స్ ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తోంది. ప్రస్తుతం 9 ఆస్పత్రులు, 3064 పడకలు ఉన్న ఈ సంస్థ త్వరలో చెన్నై, బెంగళూరు నగరాలకు విస్తరించనుంది. ఈ రెండు నగరాల్లో 250- 300 పడకల సామర్థ్యం గల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని, భవిష్యత్తులో ఒక్కో ఆస్పత్రి సామర్థ్యాన్ని 700- 800 పడకాలకు పెంచాలనే ఆలోచన ఉందని భాస్కరరావు తెలిపారు. చెన్నైలో స్థలం ఎంపిక, అనుమతుల కోసం దరఖాస్తు చేయడం పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పడకలను ఇంకా పెంచుకుంటామని వివరించారు.
సగం వరకు సొంత నిధులే
"విస్తరణ కార్యకలాపాలకు అయ్యే సొమ్ములో సగం వరకు సొంత నిధులే ఖర్చు చేస్తాం. మిగతా సగానికి బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటాం. ఒకేసారి నిధులు సేకరించాల్సిన పనిలేదు, ఏటేటా కొంత సమీకరిస్తే సరిపోతుంది. గత దశాబ్ద కాలానికి పైగా మేము 20 శాతం చొప్పున వార్షిక వృద్ధి నమోదు చేశాం. ఇదే స్థాయి వృద్ధిని భవిష్యత్తులోనూ కొనసాగించాలనేది మా ఉద్దేశం"
-బి.భాస్కరరావు, కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్
మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధత