తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2021, 7:51 AM IST

ETV Bharat / business

'రిటైల్‌ రుణాలు పెరుగుతున్నాయ్‌'

ప్రస్తుతం ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థపై యాక్సిస్​ బ్యాంక్​ సీఈఓ అమితాబ్ ఛౌద్రి 'ఈనాడు'తో ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుండటం వల్ల యాక్సిస్​ బ్యాంక్​ వృద్ధి సాధిస్తోందని తెలిపారు. అనేక రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యం పెంచే ప్రతిపాదనలు బడ్జెట్‌లో ఉన్నందున, రుణాలకు గిరాకీ మరింత పెరగొచ్చని అంచనా వేశారు.

amitabh chaudhry
'రిటైల్‌ రుణాలు పెరుగుతున్నాయ్‌'

‘ఏడాది కాలంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఆర్థిక వ్యవస్థ మెరుగవుతున్న సంకేతాలతో ఇప్పుడు వేగంగా కోలుకుంటోంది. ఆర్థిక వృద్ధిలో బ్యాంకుల చేయూత ఇప్పుడు ఎంతో అవసరం. కొత్త సాధారణ జీవితంలో వినియోగదారులంతా డిజిటల్‌ సేవలవైపే మొగ్గు చూపుతున్నారు’ అని యాక్సిస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అమితాబ్‌ ఛౌద్రి తెలిపారు. ఈనాడు ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ..

యాక్సిస్‌ బ్యాంకు పనితీరు ఎలా ఉంది.. లక్ష్యాలేమిటి

కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోంది. ఇది బ్యాంకు పనితీరుపైనా సానుకూల ప్రభావాన్ని చూపిస్తోంది. మూడో త్రైమాసికంలో 15శాతం పైగా వృద్ధి సాధించాం. రిటైల్‌ రుణాలు 34 శాతం వరకు పెరిగాయి. కొవిడ్‌ ముందుస్థాయితో పోల్చినా ఇవి పెరిగాయి. కార్పొరేట్‌ రుణాల్లో 11శాతం వార్షిక వృద్ధి రేటు, ఎస్‌ఎంఈ రుణాల్లో 6శాతం త్రైమాసిక వృద్ధి రేటు కనిపించింది. హామీతో కూడిన రుణాలు దాదాపు 81శాతం ఉండగా, హామీలేని రుణాలు 19 శాతం ఉన్నాయి. ఇప్పుడు వినియోగదారులు ఖర్చు పెట్టడం ప్రారంభించారు. అందుకే రిటైల్‌ వ్యాపారాలు వృద్ధి చెందడం మొదలయ్యింది. ఇది బ్యాంకుకు మేలు చేసేదే. ఆర్థిక వృద్ధిలో మా బ్యాంకు పాల్గొనేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. మా బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్ఠంగా ఉంది. అనేక రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యం పెంచే ప్రతిపాదనలు బడ్జెట్‌లో ఉన్నందున, రుణాలకు గిరాకీ మరింత పెరగొచ్చు.

బ్యాంకులన్నీ డిజిటల్‌ విధానాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి కదా.. మీరేం చేస్తున్నారు

డిజిటల్‌ విధానంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూనే ఉన్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 17 కొత్త డిజిటల్‌ సేవలు లక్ష్యం చేసుకోగా, ఇందులో 12 అందుబాటులోకి తెచ్చాం. రానున్న రోజుల్లో మొత్తం సేవలను తీసుకొస్తాం. డిజిటల్‌ ఛానళ్ల విషయంలో ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుతున్నాం. మా లక్ష్యం అంతా.. 'కొత్త సాధారణ జీవితం'లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడటమే. డిజిటల్‌ సేవల ఏర్పాట్లపై 800 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. 2020 ఏప్రిల్‌-డిసెంబరు మధ్య 72శాతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 71శాతం కొత్త పొదుపు ఖాతాల ఆరంభం డిజిటల్‌ విధానాల్లోనే జరిగాయి. 56 శాతం వ్యక్తిగత రుణాలనూ డిజిటల్‌ ఛానళ్ల ద్వారానే అందించాం. 78శాతం క్రెడిట్‌ కార్డులనూ ఇదే విధానంలో అందించాం.

కరోనా మహమ్మారి ప్రైవేటు బ్యాంకింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపించింది

2020 సంవత్సరం అనే కన్నా.. కొవిడ్‌-19 సంవత్సరంగానే గుర్తుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాన్ని, పనితీరునూ ఇది మార్చేసింది. మన ఆర్థిక వ్యవస్థనూ దెబ్బతీసింది. బ్యాంకింగ్‌ రంగం దీనికి మినహాయింపేమీ కాదు. మాకు ఖాతాదారుల సహకారం ఎంతో అవసరమైంది. ఆర్‌బీఐ మారటోరియం, రుణాల పనర్‌వ్యవస్థీకరణతో పాటు, ప్రజల చేతిలో నగదు లభ్యత పెరిగేందుకు పలు చర్యలు తీసుకుంది. ఆర్‌బీఐ, ప్రభుత్వ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ కొంత మేర స్థిరీకరించుకుంది. కొన్ని పెద్ద బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రొవిజన్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. అయితే, ఊహించినంత ఒత్తిడి ఎదురవలేదనే చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటూ, అందరూ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. బ్యాంకులు కూడా సానుకూల ధోరణితో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉంది.

వడ్డీ రేట్లు ఎలా ఉండబోతున్నాయి

వడ్డీ రేట్లను ఆర్‌బీఐ స్వల్పంగా తగ్గించే అవకాశం ఉంది. కానీ, ఇది ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉండవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా స్టీల్‌, అల్యూమినియం, ఆహార ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రభుత్వ ఖర్చుకు ఆర్‌బీఐ అండగా నిలిచే అవకాశం ఉంది. ఇవన్నీ వడ్డీ రేట్లపై ప్రభావం చూపిస్తాయి.

ఇదీ చదవండి :రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో జీఎస్​టీ విడుదల

ABOUT THE AUTHOR

...view details