తెలంగాణ

telangana

ETV Bharat / business

సీరం ట్రయల్స్​పై 'వలంటీర్' ఎఫెక్ట్ ఎంత? - volunteer side effects serum

సీరం సంస్థ నిర్వహిస్తున్న కొవిషీల్డ్ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి.. తనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. పరిహారంగా రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటిని సంస్థ పూర్తిగా ఖండించింది. కానీ ఈ పరిణామాలు టీకా ట్రయల్స్​పై ప్రభావం చూపిస్తాయా? వలంటీర్​కు పరిహారం లభిస్తుందా?

Inspite of controversy SII trial will continue, says IMA
సీరం ట్రయల్స్​పై 'వలంటీర్' ఎఫెక్ట్ ఎంత?

By

Published : Dec 1, 2020, 4:35 PM IST

Updated : Dec 1, 2020, 5:10 PM IST

భారత్​లో టీకా రేసులో ముందున్న సీరం సంస్థకు ఇటీవల ఓ చిక్కొచ్చి పడింది. సీరం నిర్వహిస్తున్న ట్రయల్స్​లో పాల్గొన్న ఓ వలంటీర్.. తనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, అందుకు పరిహారంగా రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రకటనను సీరం సంస్థ తీవ్రంగా ఖండించింది. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ వివాదం సీరం సంస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ట్రయల్స్​ కొనసాగే విషయంలో మున్ముందు జరిగే పరిణామాలు ఏంటన్న విషయంపై ప్రస్తుతం సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వివాదం ఏంటంటే...

చెన్నైలోని అన్నా నగర్​కు చెందిన 40 ఏళ్ల బిజినెస్ కన్సల్టెంట్.. సీరం సంస్థ నిర్వహించిన కొవిషీల్డ్ టీకా ట్రయల్స్​లో పాల్గొన్నారు. టీకా తీసుకున్న పది రోజుల వరకు తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, జ్వరం సహా నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు చెప్పారు.

అనంతరం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వలంటీర్ తరఫు న్యాయవాది ఎన్​జీఆర్ ప్రసాద్ వెల్లడించారు. ఇంతకుముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. వలంటీర్ ఆరోగ్యంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిందని, టీకా వల్లే ప్రస్తుతం ఆయనకు సమస్యలు తలెత్తాయని స్పష్టం చేశారు. దీనిపై సీరం సంస్థతో పాటు ఐసీఎంఆర్, ఆస్ట్రాజెనెకా(యూకే), డీజీసీఐ, ఆక్స్​ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఆండ్రూ పోలార్డ్, టీకా ట్రయల్స్ నిర్వహించిన రామచంద్ర ఆస్పత్రి(చెన్నై)కి లీగల్ నోటీసులు జారీ చేశారు. వలంటీర్ అనారోగ్యానికి బాధ్యత వహించి రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంస్థ స్పందన

అయితే వలంటీర్ ఆరోపణలను సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్తిగా ఖండించింది. వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలకు, వలంటీర్​ ఆరోగ్య పరిస్థితికి సంబంధం లేదని తేల్చిచెప్పింది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను వ్యాక్సిన్​పై మోపుతున్నారని మండిపడింది. డబ్బు కోసమే టీకాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. టీకాపై ఈ విధంగా ఆరోపణలు చేసిన వ్యక్తి నుంచి రూ. 100 కోట్లు వసూలు చేస్తామని హెచ్చరించింది. ఇలాంటి ప్రచారాలను సమర్థంగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది.

ఈ వివాదం నేపథ్యంలో టీకా ట్రయల్స్ సమర్థతపై సీరం సంస్థ మరోసారి స్పష్టతనిచ్చింది. వ్యాక్సిన్ అత్యంత సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది. టీకా అభివృద్ధి, క్లినికల్​ ట్రయల్స్​లో అవసరమైన అన్ని నియంత్రణ, నైతిక ప్రక్రియలు, మార్గదర్శకాలు పాటించామని వెల్లడించింది.

టీకా ట్రయల్స్​పై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందని చర్చలు మొదలైన వేళ ఈ విషయంపైనా సీరం సంస్థ క్లారిటీ ఇచ్చింది. అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాతే ట్రయల్స్​ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

'పరిహారం రావొచ్చు'

మరోవైపు, వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేసే పరిణామాలేవీ తలెత్తలేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. ఆర్​వీ అశోకన్ పేర్కొన్నారు. టీకా దుష్ప్రభావాలను కనుగొనేందుకే ట్రయల్స్ ప్రధానంగా దృష్టిసారిస్తాయని చెప్పారు. అయితే చెన్నై వలంటీర్ ఘటన.. ట్రయల్స్ ప్రక్రియలో లోపాలను సరిదిద్దడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. కోర్టుకు వెళ్లేందుకు వలంటీర్లకు న్యాయవరంగా హక్కు ఉందని.. అయితే ట్రయల్స్ గురించి వారికి ముందుగానే సమాచారం ఇస్తారని చెప్పారు. మరోవైపు సంస్థకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, శాస్త్రీయ, సాంకేతిక, నైతికపరమైన క్లియరెన్సులు లభించాయని పేర్కొన్నారు. అయితే వలంటీరుకు కొంతమొత్తంలో పరిహారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

'సీరం ప్రకటన సరికాదు'

సంస్థ ప్రకటనను బట్టి చూస్తే ట్రయల్స్​పై ఈ వివాదం ఎలాంటి ప్రభావాన్ని చూపలేదని తెలుస్తోంది. ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయని సీరం స్పష్టం చేసింది.

అయితే వలంటీర్ నుంచి రూ. 100 కోట్లు వసూలు చేస్తామని సీరం చేసిన ప్రకటనపై మాత్రం పలువురు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది వలంటీర్లను బెదిరించడానికి చేసిన ప్రయత్నంగా ఉందని అంటున్నారు. వలంటీర్ సమస్యపై సరైన దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ప్రభుత్వం ఏమందంటే?

సీరం టీకా దుష్ప్రభావాల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. ఈ ఆరోపణల వల్ల వ్యాక్సిన్ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి-మళ్లీ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

Last Updated : Dec 1, 2020, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details