దేశీయంగా ఈ సీజన్లో ఉప్పు ఉత్పత్తి భారీగా తగ్గింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్తో ఉత్పత్తి నిలిచిపోవడమే ఇందుకు కారణం.
ఉప్పు ఉత్పత్తి ఈ సీజన్లో(2019 అక్టోబర్- 2020 జూన్) దాదాపు 30 శాతం తగ్గినట్లు భారత ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు బీసీ రవల్ తెలిపారు.
ఉప్పు ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే ఈ ఏడాది ఉప్పు ఉత్పత్తికి ప్రధాన సమయమైన మార్చి-మే మధ్య లాక్డౌన్ ఉండటం వల్ల ప్రతికూల ప్రభావం పడినట్లు ఆయన వెల్లడించారు.
వేసవిలోనే అధిక ఉత్పత్తి..
ఉప్పు ఉత్పత్తి ఎక్కువగా వేసవిలోనే జరుగుతుంది. వేసవిలో ఎండలకు సముద్రపు నీరు త్వరగా ఆవిరవుతుంది. ఈ సమయంలో ఉత్పత్తి చేయడం సులభమైన పని. వర్షాకాలంలో అందుకు విరుద్ధమైన పరిస్థితులు ఉంటాయి. వర్షాలు పడితే ఉప్పు కరిగిపోతుంది. మరో వైపు గత ఏడాది వానలు ఆలస్యంగా కురవడం కుడా ఉత్పత్తికి కలిసొచ్చింది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవడం వల్ల ఉప్పు ఉత్పత్తిపై ప్రభావం పడింది.
ఆలస్యం..
ప్రభుత్వం నిబంధనలు సడలించినప్పటికీ.. ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేందుకు దాదాపు 15 రోజులు ఆలస్యమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కర్మాగారాల్లో పని చేసే వారికి మాస్కులు, శానిటైజర్లు వంటి వసతులు కల్పించడం కోసం ఈ జాప్యం జరిగింది.
సరఫరాకూ ఇబ్బందులు..
దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉప్పు ఉత్పత్తి మెరుగ్గానే ఉన్నా.. సరఫరాకు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర కార్గో షిప్లపై విధించిన ఆంక్షలు, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న హోల్ సేల్ వ్యాపారులు తమ దుకాణాలను తెరవకపోవడం వంటివి సప్లయిపై ప్రభావం చూపించినట్లు వాపోతున్నారు.
డిమాండ్, సప్లయి ఆధారంగానే ఉత్పత్తి..
ప్రధానంగా డిమాండ్, సప్లయిలను ఆధారంగా చేసుకుని ఉప్పు ఉత్పత్తి చేస్తుంటారు ఉత్పత్తిదారులు. అమ్ముడవ్వని ఉప్పును నిల్వ చేయడమనేది కష్టంతో కూడుకున్న పని అయినందున.. పాత స్టాక్ అమ్ముడయ్యాకే కొత్తగా ఉత్పత్తి ప్రారంభిస్తుంటారు.
సరిపడా ఉప్పు నిల్వలు ఉన్నాయి...
ఉప్పు ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల దేశవ్యాప్తంగా కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వస్తున్న వార్తలను రవల్ ఖండించారు. దేశ అవసరాలకు సరిపడా ఉప్పు నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉప్పు కొరతపై ఆందోళన అవసరం లేదని తెలిపారు.
దేశంలో ఏటా 36 మిలియన్ టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతుందని రవల్ తెలిపారు. అందులో 8 నుంచి 8.5 శాతం మాత్రమే దేశీయ అవసరాలకు వినియోగిస్తామని.. మిగతా మొత్తాన్ని ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా దేశంలో ఉప్పు కొరత సమస్య తలెత్తేందుకు అవకాశమే లేదని చెప్పారు.
ప్రభుత్వం ఆదుకోవాలి..
లాక్డౌన్తో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం నుంచి ఉపశమనం కోరుతూ కేంద్రానికి, పలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం తరఫున లేఖలు రాసినట్లు రవల్ తెలిపారు. ముఖ్యంగా కరెంటు బిల్లులు, ఇంధన ఛార్జీలు, పోర్ట్ రుసుములు, రవాణా ఖర్చులుపై ఉపశమనం కోరినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:యూవీ శానిటైజర్తో నిమిషాల్లోనే క్రిములు ఖతం!