కరోనా దెబ్బకు దేశంలో ఇంధన డిమాండ్ పడిపోయిందని భారతీయ చమురు సంస్థ(ఐఓసీ) తెలిపింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించింది.
ఇప్పటికే దేశంలో చాలా విమానాలు రద్దయిపోయాయి. పరిశ్రమలల్లో ఉత్పత్తి కార్యకలాపాలు ఆగిపోయాయి. ఫలితంగా మార్చి తొలి రెండు వారాల్లో 10 నుంచి 11శాతం ఇంధన వినియోగం తగ్గినట్లు ఐఓసీ వెల్లడించింది.
గతేడాది ఇదే నెలలో 19.5 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను వినియోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2019 మార్చి తొలి రెండువారాల్లో 10మిలియన్ టన్నుల ఇంధనాన్ని వినియోగించినట్లు తెలుస్తోంది. దీంతో గతేడాదితో పోల్చితే ఈసారి డిమాండ్ తగ్గింది.
"కరోనా ప్రభావంతో ప్రెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోయింది. మార్చి తొలి పక్షంలో ద్రవ ఇంధనానికి 10 నుంచి 11శాతం డిమాండ్ క్షీణించింది. ప్రయాణ ఆంక్షల కారణంగానే ఇంధనాల అమ్మకాలు తగ్గాయి. పారిశ్రామిక కార్యకలాపాల మందగమనం కూడా డిమాండ్ తగ్గడానికి ఒక కారణం."
-భారతీయ చమురు సంస్థ