తెలంగాణ

telangana

ETV Bharat / business

'మాంద్యం ముప్పు పొంచి ఉంది.. బ్రహ్మాస్త్రమూ ఉంది'

ఆర్థిక మందగమనం ముంచుకొస్తోందా?... ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కోటి డాలర్ల ప్రశ్న. ఇదే సమస్య భారత్​నూ వేధిస్తోంది. మాంద్యమే వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మన దేశ బలాలు, బలహీనతలు ఏంటి? ఈ సమస్యను ఎలా అధిగమించాలి? అనే విషయాలను మనతో ఆర్థిక నిపుణులు అనంత్​ పంచుకున్నారు. ఆయన ఏమంటున్నారంటే..

By

Published : Sep 26, 2019, 3:22 PM IST

Updated : Oct 2, 2019, 2:32 AM IST

'మాంద్యం ముప్పు పొంచి ఉంది.. బ్రహ్మాస్త్రమూ ఉంది'

ఆర్థిక మాంద్యం మళ్లీ పడగ విప్పుతుందా? ఇప్పుడు ప్రపంచం అంతటినీ కలవరపెడుతోన్న ఓ పెద్ద ప్రశ్న ఇది. ఈ సమస్య భారత్​నూ వేధిస్తోంది. అయితే మరేం ఫర్వాలేదు. వ్యక్తిగతంగా, సంయుక్తంగానూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. మందగమనాన్ని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఇంకా ఉండనే ఉంది.

భారత్​ విషయానికి వస్తే

ప్రభుత్వ గణాంకాలు, ఆర్​బీఐ వార్షిక నివేదికలు.. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిని, సమస్యలను తేటతెల్లం చేస్తాయి. ఆర్​బీఐ వార్షిక నివేదిక ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెబుతోంది. అదేమంటే... దేశంలో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయని. ఇది సంతోషకరమైన విషయమే.

మరైతే ఆందోళన చెందాల్సిన విషయం ఒకటుంది. ప్రభుత్వం జాగ్రత్తగా లేకపోతే ప్రస్తుత మందగమనం మరింత తీవ్రమై... పెను సమస్యగా మారే ప్రమాదం ఉంది.

అంతర్గత, బాహ్య కారకాలు

ఆసియా, ఐరోపా​, దక్షిణ అమెరికా దేశాలతో పోల్చితే భారత్​ ఎప్పుడూ ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థగా లేదు. మనది పూర్తిగా అంతర్గత వినియోగం ఆధారిత ఆర్థిక వ్యవస్థ. అందువల్ల మన దేశానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు అవి తెరమీదకు వస్తున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తోడు, ప్రపంచ ప్రతికూల పవనాలు వీస్తున్న ఈ తరుణంలో దేశ అంతర్గత బలహీనతలు బయటపడుతున్నాయి.

మందగమనం చక్రీయమా? నిర్మాణాత్మకమా?

ప్రస్తుత మందగమనం కాలానుగుణంగా తిరిగి మళ్లీమళ్లీ వచ్చే ప్రక్రియా? లేదా దీర్ఘకాలంపాటు వేధించే నిర్మాణాత్మక మాంద్యానికి దారితీస్తుందా? అనేది ప్రస్తుత ప్రశ్న.
ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... వర్షాలు, వరదలు సహా కాలానుగుణ కారకాలు అన్నీ కలిపి చూస్తే ఈ మందగమనం... చక్రీయమూ, అలాగే నిర్మాణాత్మకమూ అనిపిస్తోంది. అయితే ఇప్పుడున్న సమాచారంతో దీన్ని రూఢీగా చెప్పలేము. పండుగ సీజన్ ముగిసిన తరువాత మాత్రమే దీనిపై మరింత స్పష్టత వస్తుంది. మందగమనం జనవరి చివరిలో కూడా కొనసాగితే... ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే.

వివిధ రంగాల క్షీణత

వాహన అమ్మకాల క్షీణత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2020 మార్చి నాటికి బీఎస్​-6 వాహనాలను మార్కెట్​లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. కాలం చెల్లిన మోడళ్ల ఉత్పత్తిని వాహనతయారీ సంస్థలు నిలిపివేశాయి. అలాగే గృహ, ఆర్థిక, ఐటీ, బ్యాంకింగ్​ రంగాలూ నష్టాలు చవిచూస్తున్నాయి.

సమస్య ఇలా ప్రారంభమైంది

పై విషయాలు అన్నీ గమనిస్తే.. సమస్య ఎక్కడ ఉంది? ఆర్థిక మందగమనం ఎందుకు ఉంది? అనే ప్రశ్న వస్తుంది. కానీ సమస్య చాలా వాస్తవమైనది. ఇది రోజురోజుకూ తీవ్రమవుతోంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భారత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ మాంద్యం మొదలైంది. సాధారణంగా ఎన్నికలు... ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునందిస్తాయి. కానీ ప్రభుత్వం చేపట్టిన నోట్లరద్దు, లోపభూయిష్ట జీఎస్టీ అమలుతో సమస్య ప్రారంభమైంది.

అప్పుల ఊబిలోకి.. గృహరంగం

నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో ముఖ్యంగా గృహస్థులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థూల జాతీయ పొదుపులో 19.2 శాతం మేర గృహస్థుల పొదుపు క్షీణించింది. 2014-15లో ఈ జీఎన్​డీఐ 16.9 శాతం కనిష్ఠానికి పడిపోయింది. 2017-18లో స్వల్పంగా (17 శాతం) వరకు కోలుకుంది.

అదే సమయంలో గృహరంగ అప్పులు ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నాయి. 2015-16లో 2.7 శాతం ఉన్న అప్పులు, 2017-18 నాటికి 4.3 శాతానికి (జీఎన్​డీఐ) చేరుకున్నాయి. అలాగే వ్యక్తిగత రుణాలు 2014 మార్చి నుంచి రూ.10.36 లక్షల కోట్ల నుంచి 2019 జూన్​ నాటికి 22.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

అనవసర ఖర్చులు

మధ్యతరగతి ప్రజలు తమ అవసరాలకు కాకుండా విలాసాలకు ఖర్చులు పెట్టడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లలో భోజనం, సెలవులకు విహార యాత్రలకు వెళ్లడం, అవసరం లేని విలాస వస్తువులు కొనుగోళ్లు చేయడం వంటివి చేస్తున్నారు. ఇది అవసరాల కంటే కోరికలు తీర్చుకోవడానికే ప్రజలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేటతెల్లం చేస్తోంది. అంటే వారి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఫలితంగా వారి పొదుపు గణనీయంగా పడిపోతోంది.

ఉత్పాదక, సేవా రంగాలు

ఉత్పాదక రంగం అప్పులు 2014 నుంచి నేటి వరకు 15 శాతం మాత్రమే పెరిగాయి. అంటే 2014 మార్చి నాటికి రూ.25.22 లక్షల కోట్లుగా ఉన్న అప్పులు 2019 నాటికి రూ.28.58 లక్షలకు మాత్రమే చేరుకున్నాయి. ఇదే సమయంలో సేవల రంగం అప్పులు మాత్రం 2014 నుంచి 2019 మధ్య రూ.13.27 లక్షల కోట్ల నుంచి రూ.24.15 లక్షల కోట్లకు పెరిగాయి.

బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదా?

బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్న వాదనలో కొంత మేరకు మాత్రమే నిజం ఉంది. నిరర్థక ఆస్తులు-ఎన్​పీఏ సమస్య ఉన్నప్పటికీ బ్యాంకులు సమృద్ధిగా నగదు కలిగి ఉన్నాయని ఎస్​బీఐ ఛైర్మన్ ఇటీవల చెప్పడం గమనార్హం. అయితే ఎన్​పీఏల పెరుగుదల గురించి బ్యాంకులు ఆందోళన చెందుతున్నందున కొంచెం జాగ్రత్తగా ఉంటున్న మాట వాస్తవం.

డిమాండ్​ లేకనే..

పై కారణాలన్నింటినీ విశ్లేషిస్తే.. భారత్​ను వేధిస్తున్న ప్రధాన సమస్య 'డిమాండ్​' లేకపోవడం. మరో విధంగా చెప్పాలంటే కావాల్సినంత సరఫరా ఉంది.. కానీ అందుకు తగ్గ డిమాండ్​ లేదు. అందువల్ల రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్న రుణగ్రహీతలకు అప్పులు దొరకవు అనే సమస్యే లేదు.

రుణాలు తీసుకునే సామర్థ్యం ఉన్నవారు రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడం మరో సమస్య. అధికంగా రుణపడి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు రుణాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సామర్థ్యం లేనివారికి అప్పులు ఎవరు ఇస్తారు చెప్పండి!

ఆ మూడు కారణాల వల్లే..

మూడు ముఖ్య కారణాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థలో సమస్యలు తీవ్రమవుతున్నాయి. అవి...

  • ఎ) ప్రభుత్వ రుణాలు గణనీయంగా పెరగడం
  • బి) గృహ, వ్యాపార రంగాలపై ఇప్పటికే ఉన్న రుణాలకు తోడు పన్నుల భారమూ పెరగడం.
  • సీ) ఎన్​బీఎఫ్​సీ సంక్షోభం

అధిక వడ్డీ సమస్య

భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అధిక వడ్డీ రేట్లు. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ వడ్డీరేట్లు ఉన్నప్పటికీ, భారత్​లో ఇప్పటికీ అధిక వడ్డీరేట్లతోనే రుణాలు పొందాల్సిన పరిస్థితి ఉంది.

ఇందుకు ప్రధాన కారణం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు భారీ మొత్తంలో రుణాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వానికి రుణాలు ఇవ్వడం సురక్షితమని బ్యాంకులు భావించడం వల్ల సులువుగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల రుణాలు 2013లో రూ.46,400 కోట్లు ఉండగా, 2019 నాటికి ఈ రుణాలు రూ.1.26 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

ఫలితంగా అప్పుల కోసం భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. ఇది వడ్డీలు అధికంగా వడ్డించడానికి అవకాశం ఇస్తోంది. ఫలితంగా ప్రైవేటు రంగానికి అవసరమైన రుణాలు చౌకగా లభించడం లేదు.

పన్నులూ..... రుణాలూ... పెరుగుతున్నాయ్

ప్రభుత్వానికి పన్నుల రూపేణా వస్తున్న ఆదాయం పెరుగుతున్నప్పటికీ... రుణాలూ పెరగడం మరో సమస్య. పన్నులు 2018-19లో రూ.23.87 లక్షల కోట్లు నుంచి రూ.39.68 కోట్లకు పెరిగాయి. 2020 మార్చి చివరినాటికి ఈ పన్నులు రూ.44.12 లక్షల కోట్లకు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే ప్రభుత్వ వీటిని సక్రమంగా వినియోగించలేకపోవడానికి ప్రధాన కారణం... అప్పులకు తోడు ప్రపంచ ఆర్థిక మందగమనమే.

చమురు పన్నులు

పెట్రోల్​, డీజల్​లపై పన్నుల భారం పెరగడం కూడా సామాన్యుల నడ్డివిరుస్తోంది. ఫలితంగా దేశీయ వినియోగ శక్తి క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్​బీఎఫ్​సీలనూ చూడాలి. కొన్ని పెద్ద ఫైనాన్స్ కంపెనీలు సంక్షోభంలో చిక్కుకుని ఎన్​బీఎఫ్​సీలు మంజూరు చేసిన రుణాలను తిరిగి చెల్లించలేకపోయాయి. ఫలితంగా ఆ రంగానికి కూడా ఇప్పుడు రుణాలు లభించడం గగనమైపోయింది.

క్లిష్టపరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం చాలా క్లిష్టమైన దశకు చేరుకుంది. ప్రభుత్వం జాగ్రత్తగా ఉండకపోతే.. ప్రస్తుత చక్రీయ మందగమనం.. నిర్మాణాత్మక మందగమనంగా మారే ప్రమాదం ఉంది.

దురదృష్టవశాత్తు ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకోవడాన్ని వాయిదా వేస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చింది. ఎందుకంటే ఈ సమస్యకు సులభమైన పరిష్కారాలు లేవు.

భారీ మూల్యం చెల్లించకతప్పదు.

కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే... భవిష్యత్​లో దారుణమైన సమస్యలు ఎదుర్కొనే సామర్థ్యం మనకుంటుందా అనేది ప్రశ్న.

బ్రహ్మాస్త్రం ఒక్కసారికే..

ఆర్​బీఐ తన నిల్వలను ప్రభుత్వానికి బదిలీ చేయడం ఒక స్వల్పకాలిక పరిష్కారం మాత్రమే. ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటింది. దీనిని ఒక్కసారే ప్రయోగించగలం. దీనిని దుర్వినియోగం చేస్తే ఇక చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడమే అవుతుంది. సమస్య చేయి దాటిపోతుంది. ఆర్​బీఐ నుంచి వచ్చిన నిధులను తెలివిగా వాడుకోవాలి. అంతే కాని రాయితీ పథకాలకు వృథా చేయకూడదు.

అలాగే గృహ, పారిశ్రామిక రంగాలు, సంస్థలు భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకుని తమ ఖర్చులు, అప్పులు తగ్గించుకోవాలి. పొదుపు మంత్రం పాటిస్తూ తెలివిగా అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చులు చేయాలి.

అవకాశాలు ఉంటాయ్​ .. కానీ

ఆర్థిక వ్యవస్థలో అవకాశాలు కోల్పోవడం వంటివి ఎప్పుడూ ఉండవు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కోసం ఎల్లప్పుడూ అవకాశాలు తెరుచుకునే ఉంటాయి. అయితే ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి మాత్రం డబ్బు కావాలి.
- డాక్టర్​ ఎస్​ అనంత్​, ఆర్థిక నిపుణులు

ఇదీ చూడండి: ఆఫర్ల సీజన్​: కొత్త కారు ఇప్పుడు కొనడమే మంచిదా?

Last Updated : Oct 2, 2019, 2:32 AM IST

ABOUT THE AUTHOR

...view details