భారత్ గత పదేళ్లుగా డిజిటల్ విప్లవంలో ప్రగతి బాటలో పయనిస్తోందని.. ఈ ప్రయాణం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఒమిడియార్ నెట్వర్క్ ఇండియా నివేదికలో వెల్లడించింది. డిజిటలీకరణలో ప్రపంచంలోనే భారత్ గొప్ప ఉదాహరణగా నిలిచినట్లు పేర్కొంది. డిజిటల్ సొల్యూషన్స్ భారీ ఎత్తున సమాజంపై ప్రభావం చూపుతున్నాయని, సాంకేతికేతర అంశాలను సరైన దారిలోకి తేవడమే ఇప్పుడు కీలకమని సూచించింది. డిజిటల్ ఇండియాకు తరువాతి హద్దు అయిన ఓపెన్ డిజిటల్ ఎకోసిస్టమ్స్ (ఓడీఈలు) గురించి కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) వివరించింది.
భారత్లో ఫారాలు డౌన్లోడ్ చేయడం, దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో చూసుకోవడం వంటివాటితో మొదలైన డిజిటల్ విప్లవం ఇప్పుడు పన్నులు ఆన్లైన్లో చెల్లించడం, సంక్షేమ పథకాల ఆర్థికసాయాన్ని పొందడం స్థాయికి చేరింది. ఇప్పుడు మనం ఓ కొత్త మైలురాయి వద్ద ఉన్నాం. డిజిటల్ వసతుల రూపకల్పనలో భారత్ ప్రపంచానికే దారి చూపుతోంది. ఓడీఈల రూపంలో సాంకేతిక వసతుల రూపకల్పన ద్వారా ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధ్యమవుతుంది. ఎన్నో అపాయాలను, ఇబ్బందులను తొలగించవచ్చు.