ఎలక్రానిక్స్ వంటి ఫినిష్డ్ వస్తువుల కోసం చైనా నుంచి దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడి ఉందని అందరూ భావిస్తారు. చైనాకు ముడి ఇనుము ఎగుమతి చేయడంలో భారత్ ముందంజలో ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- ఫిబ్రవరిలో ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 114 శాతం వృద్ధి చెందాయని పరిశ్రమ సంఘం ఇంజినీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఈపీసీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అగ్రగామి 25 విపణులకు భారత్ ఇంజినీరింగ్ ఎగుమతుల వాటా దేశ మొత్తం ఇంజినీరింగ్ ఎగుమతుల్లో నాలుగింట మూడొంతులు పైగానే ఉన్నాయి. సంప్రదాయ మార్కెట్లపై భారత ఎగుమతిదార్లు ఆధారపడుతుండటాన్ని ఇది సూచిస్తోంది.
ఆ దేశాల్లో మంచి గిరాకీ
భారత ఇంజినీరింగ్ ఉత్పత్తులకు చైనా, సింగపూర్, జర్మనీ, థాయిలాండ్, ఇటలీ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో చైనాకు ఎగుమతుల్లో సానుకూల వృద్ధి నమోదైంది. గత నెలలో చైనాకు పంపిన ఎగుమతులు 68 శాతం పెరిగి 235.58 మిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూస్తే, 114 శాతం పెరిగి 4.28బిలియన్ డాలర్లు గా నమోదయ్యాయి. ఈఈపీసీ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
- చైనాకు ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైనప్పటికీ.. భారత్ నుంచి అత్యధికంగా ఇంజినీరింగ్ ఉత్పత్తులు ఎగుమతి అవుతోంది అమెరికాకే.
- అయితే 2020-21 మొదటి 11 నెలల్లో అమెరికాకు పంపిన ఇంజినీరింగ్ ఎగుమతులు తగ్గాయి. ప్రపంచ దేశాలకు భారత్ నుంచి అత్యధికంగా ఇంజినీరింగ్ వస్తువులు వెళుతున్నాయి. ఆ తర్వాత స్థానంలో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. విదేశీ మారకంలో ఇవి ప్రధాన వనరుగా ఉన్నాయి.
ఫిబ్రవరిలో ఎగుమతులు తగ్గడానికి బేస్ ఎఫెక్ట్ కారణమని, గతేడాది ఇదే నెలలో ఇవి భారీగా పెరిగాయని ఈఈపీసీ ఇండియా ఛైర్మన్ మహేశ్ దేశాయ్ ఈటీవీ భారత్కు తెలిపారు.
ఇదీ చూడండి:'టీకా ఉత్పత్తిని పెంచేందుకు నిధులివ్వండి!'