తెలంగాణ

telangana

సిరి: మీరు ధనవంతులు కావడంలో అడ్డంకులు ఇవే!

By

Published : Oct 13, 2019, 6:21 AM IST

భూమి మీద పుట్టిన ప్రతిఒక్కరూ తాము ధనవంతులం కావాలని కోరుకుంటారు. మరి ఆ లక్ష్యాన్ని చేరుకునేవారు మాత్రం కొందరే ఉంటారు. జీవనశైలిలో మార్పులు, అదుపులేని ఖర్చులు, తగినంత దాచుకోకపోవడం, అప్పుచేసి పప్పు కూడు తినడం సహా పలు అవరోధాలు ఉంటాయి. మరి లక్ష్యాన్ని చేరుకునే మార్గం ఏంటి? మీరే చూడండి.

సిరి: మీరు ధనవంతులు కావడంలో అడ్డంకులు ఇవే!

కోటీశ్వరులు కావాలని కోరుకోని వారెవరు చెప్పండి. ఇలా ఆలోచించే వారిలో తమ లక్ష్యాన్ని చేరుకునేవారు మాత్రం కొందరే ఉంటారు. కారణం అందరూ అంత క్రమశిక్షణతో తమ ప్రణాళికలను అమలు చేయకపోవడమే. కాలం… అవకాశం ఒకసారి చేజారితే మళ్లీ తిరిగి రావు. పొదుపు, మదుపు విషయం కూడా అంతే. ఒక్కసారి పొరపాటు చేశామా? అంతే… కోటీశ్వరులైనా… మళ్లీ మొదటి నుంచే ప్రారంభించాల్సి రావచ్చు. ప్రస్తుతం ఎవరిని కదిలించినా వేలకు వేల జీతాన్ని ఆర్జిస్తున్నామని గర్వంగా చెబుతుంటారు. కానీ, నెలాఖరునాటికి ఎంత మొత్తం చేతిలో ఉంటుంది అని అడిగితే మాత్రం అయోమయంగానే చూస్తారు.

జీవన శైలిలో మార్పులు, పెరుగుతున్న ఖర్చుల వల్ల ఎంతోకొంత అప్పు చేస్తేగానీ బయటపడని పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ఆకస్మిక ఖర్చులు వస్తే చెప్పాల్సిన పనేలేదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డుతో అప్పులు, ఇలా అందిన చోటల్లా అప్పు తెచ్చి… వందలకు వందలు వడ్డీలకిందే జమ చేసేస్తుంటారు. అందుకే, మనం అనుకుంటున్న లక్ష్యం ఎప్పుడూ కళ్లముందే కనిపిస్తున్నా… చాలామంది దాన్ని చేరుకోవడానికి ఓ జీవిత కాలం సరిపోకపోవచ్చు. అసలు సాధారణంగా వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో మనం చేసే పొరపాట్లేమిటి? ఎందుకు మనం ధనవంతులుగా మారలేకపోతున్నాం?

అదుపులేని ఖర్చు

సంపాదించిందంతా ఖర్చులకే వెళ్తొందని బాధపడుతుంటారు చాలామంది. కేవలం నాకే ఎందుకిలా అనుకుంటారు… ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… దాదాపు 52 శాతం మంది ఇలా వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేసేవారే. ఇందులో కొంతమంది తమకు వచ్చిన ఆదాయం మేరకే వ్యయం చేస్తుంటే… 22 శాతం మంది మాత్రం క్రెడిట్‌ కార్డు ఇతర మార్గాల్లో తమ ఖర్చులను వెళ్లదీస్తున్నారు. ప్రతి నెలా సంపాదించందంతా ఖర్చు పెట్టేస్తుంటే… ఎప్పటికీ మనం ధనవంతులుగా మారలేం. అందుకే, వచ్చిన సొమ్ము ఎటు వెళ్తుందనే దానిపైన నిఘా వేయండి. ఎక్కడెక్కడ వృథా ఖర్చు అవుతుందనే విషయాన్ని పట్టించుకోండి. వాస్తవిక దృష్టితో ఆలోచించించి బడ్జెట్‌ వేసుకోండి. అప్పుడే ఖర్చులు తగ్గి, మిగులు కనిపిస్తుంది.

తగినంతగా దాచకోకపోవడం

ధనవంతులుగా మారాలంటే పాటించాల్సిన మొదటి సూత్రం ఏమిటో తెలుసా? తగినంత పొదుపు చేయడం. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, రుణాల వడ్డీరేట్లు సంపాదనంతా హరించి వేస్తున్నాయి. పొదుపు చేయడానికే మిగలడం లేదు. ఇక పెట్టుబడి గురించి ఆలోచన ఎక్కడ? ప్రస్తుతం చాలామంది ధోరణి ఇలాగే ఉంది. ప్రతి నెలా ఖర్చు చేయగా మిగిలినదే పొదుపు అని పొరపడుతుంటారు. ఖర్చుపెట్టగా మిగిలింది కాకుండా ప్రతి నెలా లక్ష్యంగా పెట్టుకొని మిగిల్చిందే పొదుపు అనేది మర్చిపోకూడదు.

అందుకే, పొదుపు మొత్తాన్ని కూడా ఒక అత్యవసర, ప్రథమ ఖర్చు జాబితాలో రాసుకోండి. ఆ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నించండి. అప్పుడే భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే ఆర్థిక సామర్థ్యం మన సొంతం అవుతుంది. అత్యవసరాల కోసమే కాదు… భవిష్యత్తు కోసం ఎంతో కొంత దాచుకోవాలనేది ఎవరూ కాదనలేని నిజం. ఇప్పటి లెక్కలతో రానున్న ఐదారేళ్ల కాలాన్ని కూడా సరిపోల్చలేం. అందుకే, సాధ్యమైనంత మేరకు దాచుకోవాల్సిన పరిస్థితి. ఒక మాటగా చెప్పాలంటే… మనకు వచ్చే ఆదాయంలో కనీసం 10 నుంచి 20 శాతం వరకూ పొదుపు చేస్తే బాగుంటుంది.

అప్పు చేసి పప్పుకూడు

అప్పు చేయందే ఏ పనీ తోచదు కొంతమందికి. ఇందులో మంచి అప్పులు… చెడ్డ అప్పులు ఉంటాయి. విద్యారుణం, గృహరుణంలాంటివి మంచి అప్పుల జాబితాలోకి వస్తాయి. అదే వ్యక్తిగత రుణం తీసుకొని విహార యాత్రకు వెళ్లారనుకోండి… క్రెడిట్‌ కార్డు ఉందికదా అని ఖరీదైన హోటళ్లో భోజనం చేద్దామనుకుంటే… ఇవీ చెడ్డ అప్పులు. వీటివల్ల మనకు ఆర్థికంగా ప్రయోజనం రాదు సరికదా! అప్పుల వూబిలోకి దిగజారుస్తాయి. పైగా ఈ అప్పులకు వడ్డీలు కట్టేందుకే, సంపాదించిందంతా వెళ్లిపోతుంది.

అవసరంలో ఎవరినీ చేయిచాచి అర్థించకుండా… అప్పులు చేయకుండా ఉండాలంటే… మన మనస్తత్వంలో మార్పు రావాలి. మీరు సంపాదించిదంతా… వెంట వెంటనే ఖర్చు చేయాలన్న ఆలోచనల్నుంచి ముందుగా బయటపడాలి. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలను వెంటనే తీర్చేయడానికి ప్రయత్నించండి. కొన్ని మంచి పనులకు మనలోని కొన్ని గుణాలను త్యాగం చేయాల్సిందే. పొదుపు విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఇలా చేయగలిగినప్పుడే కోటీశ్వరులుగా మారాలనే మీ కోరిక సిద్ధిస్తుంది.

సరైన ప్రణాళిక లేకపోవడం

ఎక్కడికెళ్లాలో తెలియకుండా ప్రయాణం ప్రారంభించం. ఆర్థిక విషయాల్లో కూడా అంతే. ఏం సాధించాలో తెలియకుండా వూరికే పొదుపు, పెట్టుబడుల వల్ల ఫలితం ఉండదు. సరైన ప్రణాళిక లేకపోతే కోటీశ్వరులు కావాలనుకోవడం తీరని కలగానే మిగిలిపోతుంది. ప్రణాళిక వేసుకోవడంలో విఫలం కావడం అంటే… లక్ష్య సాధనకు కూడా దూరం కావడమే.

అత్యవసర నిధి

సహజంగా ఆరు నెలల ఖర్చులకు సరిపడా మొత్తం అత్యవసర నిధిగా అందుబాటులో పెట్టుకోవాలని నిపుణులు సూచించే మాట. రోజువారీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ఈ ఏర్పాటు ఉండాలని చెప్పేది. కానీ, చాలామంది దగ్గర ఒక నెల సరిపడా మొత్తం కూడా ఉండదు. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే… అత్యవసరాల్లో ఇబ్బందులు పడకుండా ఉండాలి. అందుకే, మీ పొదుపును ముందుగా దీనితోనే ప్రారంభించండి. సాధ్యమైనంత తొందరగా అత్యవసర నిధిని సిద్ధం చేసుకొని, పెట్టుబడులపై దృష్టి సారించండి.

ఆలస్యం చేస్తే

ఆలస్యం అమృతం విషం… అన్నారు పెద్దలు. ఏదైనా సరే… సమయానికి జరిగిపోతేనే దానికి ఓ విలువ. అందుకే, ఆర్జించడం ప్రారంభించగానే పొదుపు మదుపు కూడా ఆరంభించాలి. సంపాదన తక్కువగా ఉంది అంటే… పిండి కొలదీ రొట్టె అన్నట్లు… మీ సంపాదనను బట్టే పొదుపు చేయండి. అప్పుడే మన లక్ష్యం తొందరగా ప్రారంభించడానికి వీలవుతుంది.

23 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.3045 చొప్పున మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తూ వెళ్లాడనుకుందాం. అప్పుడు 25 ఏళ్లలో అతని దగ్గర రూ.కోటి జమ అవుతుంది. అదే అన్ని పరిస్థితులూ బాగుండి… 17శాతం రాబడి అంచనాతో మదుపు చేస్తే నెలకు రూ.2083 చాలు. ఆలస్యం చేస్తున్న కొద్దీ మనం పెట్టుబడి పెట్టే మొత్తం పెరుగుతుంది. కానీ, అనుకున్న ఫలితాన్ని మాత్రం చేరుకోలేం.

ఆచరణలో చూపాలి

డబ్బు ఎక్కడ మిగులుతుంది’… ఉన్నదంతా ఖర్చులకే పోతోంది… ఏమాత్రం ఆశాజనకంగా లేదు… మనం సంపాదించేది ఎంత? ఇలాంటి మాటలు చాలామంది నోట వింటుంటాం. నెలకు రూ.లక్ష వస్తున్నా… నెలకు రూ.12వేలు వస్తున్నా… ఎవరికి తగ్గ ఖర్చులు… వారి జీవన శైలి వారికి ఉంటుంది. సంపాదనను బట్టి వ్యక్తుల అలవాట్లూ ఉంటాయి. సాధ్యం కాదు అనే సాకులు చూపడం మానేయండి. అనుమానాలు లేకుండా మీ పొదుపు, పెట్టుబడి ప్రణాళికలను ఆచరణలో పెట్టండి. మీ శక్తియుక్తులను ఉపయోగించుకొని సంపాదనను పెంచుకునే ప్రయత్నం చేయాలి.

రేపటి కోసం కూడా

చాలామంది ఈ రోజు సంగతేమిటి? అనేదే ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో అస్సలు పనికిరాని ఆలోచన ఇది. సంపాదించేప్పుడు ఏదో ఒక విధంగా అన్నీ సవ్యంగానే సాగిపోతాయి. సంపాదన ఆగిపోయిన రోజు పరిస్థితి గురించి కూడా ఆర్జించే రోజుల్లోనే ఆలోచించడం తప్పనిసరి. అవగాహన లేకుండా, అదుపు లేకుండా చేసే ఖర్చు అప్పులకు దారితీస్తుంది. దీంతో మీరు భవిష్యత్తుకు దాచుకోవాలని అనుకునే మొత్తం తగ్గిపోతుంది. ‘ఇప్పుడు కొని… తర్వాత బాధపడటం’ అనే మనస్తత్వం దూరం చేసుకోవాలి. ‘పొదుపు ఇప్పుడు… ఖర్చు తర్వాత’ అనే సూత్రంతో లాభపడేవారే ఎక్కువ.

అన్నీ ఒకే చోటనా

పెట్టుబడుల్లో గుర్తుంచుకోవాల్సిన ప్రాథమిక సూత్రం వైవిధ్యం. చాలామంది చేసే పొరపాటేమిటంటే… పెట్టుబడికి కేటాయించే మొత్తాన్ని అంతా ఒకే పథకానికి కేటాయించడం. దీనివల్ల నష్టభయం ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఆర్థిక స్తోమత, వయసు, నష్టభయం భరించే సామర్థ్యం, అనుకున్న లక్ష్యం, ఉన్న సమయం ఆధారంగా ఎక్కడ మదుపు చేయాలనేది నిర్ణయించుకోవాలి. అప్పుడే… అధిక రాబడి సాధించి, తొందరగా ధనవంతులు అవుతారు.

భవిష్యత్తులో ఏదో జరగవచ్చనీ, హఠాత్తుగా ధనవంతులం అయిపోతామని కలలు కనడం ఎంత వరకు సబబో చెప్పక్కర్లేదు. అందుకే, నేడు మనం ఉన్న పరిస్థితి ఏమిటి? దీనికన్నా ఉన్నతంగా జీవించడానికి ఏం చేయాలి అనే వాస్తవిక దృష్టితో పరిశీలిస్తే చాలు… అన్నీ మనకే అర్థం అవుతాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని లోకంలో… మన గురించి మనం కాసేపు ఆలోచించుకుంటే పోయేదేముంది! అయితే ధనవంతులం అవుతాం! అంతే కదా!

ఇదీ చూడండి:5 పాకిస్థానీ బోట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్​ఎఫ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details