"చైనానే దోషి"... అంతర్జాతీయంగా ఇప్పుడు పదేపదే వినిపిస్తున్న మాట. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమెరికా సహా అనేక దేశాలు బీజింగ్పైనే గురిపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో ప్రాణనష్టం జరగడానికి, ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోవడానికి డ్రాగన్ దేశమే కారణమన్నది వారి వాదన. అమెరికాతో వాణిజ్య యుద్ధం కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న చైనాకు కరోనా తెచ్చిన సంక్లిష్ట పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇదే... అక్కడి అంతర్జాతీయ సంస్థలపైనా ప్రభావం చూపుతోంది.
దిగ్గజ సంస్థల పక్కచూపులు...
ఇప్పటివరకు తయారీ రంగ పరిశ్రమకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది చైనా. ఆ దేశంలో అతి చౌకగా కార్మిక శక్తి లభించడమే ఇందుకు కారణం. ఈ సానుకూలతే అనేక విదేశీ దిగ్గజ సంస్థలు చైనాలో ఉత్పత్తి కేంద్రాలను స్థాపించేందుకు కారణమైంది. కానీ... ఇప్పుడు పరిస్థితి మారింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న సంక్లిష్టతలతో ఆ సంస్థలు పునరాలోచనలో పడ్డాయి. భవిష్యత్లో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. చైనా నుంచి ఉత్పత్తి కేంద్రాలను ఇతర దేశాలకు తరలించడమే మేలన్న భావన ఆయా కంపెనీల్లో కనిపిస్తోంది.
చైనా వెలుపలకు ఉత్పత్తి కేంద్రాలు తరలించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలను ఆకర్షించే పనిలో పడింది భారత్. ఇందుకోసం 4.62 లక్షల హెక్టార్ల భూమిని కేంద్రం గుర్తించిందని తెలుస్తోంది. ఇందులో 1.15 లక్షల హెక్టార్లు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక భూమి.
చైనా నుంచి వెళ్లిపోయే జపాన్, దక్షిణ కొరియా, అమెరికా కంపెనీలకే భారత్ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే సూచించారు. చైనా నుంచి బయటకు వచ్చే కంపెనీలకు భూమి, ఇతర సదుపాయాలు కల్పించాలని సిఫార్సు చేశారు.
పారిశ్రామిక వర్గాలతో గడ్కరీ..
పరిశ్రమ వర్గాలతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడారు. జపాన్కు చెందిన చాలా కంపెనీలు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు. చైనా వెలుపల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
గడ్కరీతో మాట్లాడిన వాళ్లలో ఎస్ఎంఈ ఎగుమతుల ప్రచార మండలి అధ్యక్షుడు చంద్రకాంత్ సాలంఖీ ఒకరు. ప్రభుత్వానికి ఆయన పలు సూచనలు చేశారు.
" భారత్కు వచ్చేందుకు చాలా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని గడ్కరీ చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాల సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. దిల్లీ- ముంబయి మధ్య గ్రీన్ ఎక్స్ప్రెస్ వే చుట్టూ ఉన్న భూమిని జపాన్, దక్షిణ కొరియా కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వానికి మేం సూచించాం."
- చంద్రకాంత్ సాలంఖీ