మోటారు వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాల గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కొవిడ్-19 నేపథ్యంలో జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది. ఫిట్నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతర రవాణా సంబంధిత డాక్యుమెంట్లకు ఈ పొడిగింపు వర్తిస్తుందని పేర్కొంది.
2020 ఫిబ్రవరి 1 నుంచి 2021 మార్చి 31 మధ్య గడువు పూర్తయ్యే పత్రాలకు ఈ మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. 2021 జూన్ 30 వరకు ఆ పత్రాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ఇదివరకే నాలుగు సార్లు వాహనాలకు సంబంధించిన పత్రాల గడువును కేంద్రం పొడిగించింది. బహుశా ఇదే చివరి గడువు పొడిగింపు నిర్ణయం కావొచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కొవిడ్ వేళ రవాణాకు సంబంధించిన సేవలు పొందడంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.