భారత ఆర్థికవ్యవస్థపై కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
కరోనా వైరస్ (కొవిడ్ -19) చైనాలో పుట్టి ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ మహమ్మారి వల్ల చైనాలో ఇప్పటి వరకు 2,715 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 80,000 మంది కరోనా వైరస్తో బాధపడుతున్నారు. అంతే కాకుండా కరోనా భయం ప్రపంచ వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్యాంకుల విలీనం జరిగి తీరుతుంది...!
ప్రణాళికా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ప్రక్రియ కొనసాగుతోందని, ఇందులో ఎలాంటి అనిశ్చితికి తావులేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
నాలుగు పెద్ద రుణదాతలను సృష్టించడానికి 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయనున్నట్లు గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లు పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం కానున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పీఎన్బీ దేశంలోని రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించనుంది.