కరోనా తొలి దశ.. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ తర్వాత ఏడాదిగా ఎంతో మందిపై ఆర్థికంగా ప్రతికూల ప్రభావం పడింది. సాధారణ పౌరులు, ఉద్యోగులు, వ్యాపారులకూ ఆదాయాలు తగ్గడంతో, ఖర్చులు తట్టుకునేందుకు చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోంది. కొవిడ్ బాధితుల చికిత్స కోసం రూ.లక్షలు ఖర్చవుతుండటంతో అత్యవసరంగా నగదు కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పులు చేస్తోండటం ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. భారతీయులు సహజంగానే పసిడి ప్రియులు. అందుకే, ప్రతి కుటుంబంలోనూ ఎంతోకొంత బంగారం తప్పనిసరిగా ఉంటుంది. అవసరం అయినప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి, అప్పు తీసుకోవడం అనాదిగా వస్తున్నదే. గత ఏడాది కాలంలో ఇది మరింత పెరిగింది. వ్యక్తిగత రుణాలు.. ఇతర హామీ అవసరం లేని అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్న నేపథ్యంలో బంగారమే ఎంతోమందిని ఆదుకుంటోంది.
నిమిషాల్లోనే మంజూరు..
కరోనా బాధితులు ఆసుపత్రిలో చేరాలంటే.. అప్పటికప్పుడు కనీసం రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకైనా చెల్లించాల్సి రావడం చూస్తూనే ఉన్నాం. ఇంత పెద్ద మొత్తం చాలామంది దగ్గర అందుబాటులో ఉండదు. చేతిలో పసిడి ఉన్న వారు బ్యాంకుకు లేదా బంగారంపై రుణం ఇచ్చే సంస్థల దగ్గరకు వెళ్తే.. కనీసం 30 నిమిషాల నుంచి గరిష్ఠంగా గంటలోపే డబ్బు చేతికి వస్తుంది. ఇదీ బంగారంపై రుణాలు ఎక్కువగా తీసుకునేందుకు కారణం అవుతోంది. పైగా బంగారం మార్కెట్ రేటులో దాదాపు 75శాతం వరకూ రుణం లభిస్తుంది. మార్చి 31 వరకూ పసిడి విలువలో దాదాపు 90శాతం వరకూ రుణం లభించింది.
వడ్డీ తక్కువగా ఉండటం..
పసిడి హమీతో తీసుకున్న రుణాలకు బ్యాంకులు వార్షిక వడ్డీ 9-12శాతం మధ్య వసూలు చేస్తుండగా.. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు 15-18% తీసుకుంటున్నాయి. వ్యక్తిగత రుణాలు తీసుకున్నప్పుడు నెలనెలా వాయిదాలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, బంగారం రుణాలకు ఆ ఇబ్బంది ఉండదు. వడ్డీని ఎప్పటికప్పుడు చెల్లిస్తూ.. వీలైనప్పుడు అసలు చెల్లింపులు చేస్తూ వెళ్లొచ్చు. ఈ వెసులుబాటు ఉండటంతో అత్యవసరాల్లో పసిడిని తాకట్టు పెట్టేందుకే ఎక్కువమంది మొగ్గు చూపిస్తున్నారు.