తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ ఏడాది ఐపీఓల్లో రూ.31వేల కోట్ల సమీకరణ! - దేశీయ కంపెనీలు 2020-21లో సేకరించిన నిధులు

కరోనాలాంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఐపీఓల్లో దేశీయ కంపెనీలు అదరగొట్టాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐపీఓకు వచ్చిన భారత కంపెనీలు రూ.31 వేల కోట్లు సమీకరించాయి. గత మూడేళ్ల కాలంలో ఇదే అత్యధికం. ఎల్​ఐసీ లాంటి దిగ్గజ కంపెనీలు ఐపీఓకు రానున్న నేపథ్యంలో.. 2021-22లోనూ ఈ జోరు కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

huge growth in Fundraising from IPOs
ఈ ఏడాది అదరగొట్టిన ఐపీఓలు

By

Published : Mar 28, 2021, 8:28 PM IST

ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)కు వచ్చిన భారత కంపెనీలు బాగా రాణించాయి. ప్రపంచ మార్కెట్‌లో ద్రవ్యలభ్యత, దేశీయ షేర్‌ మార్కెట్ల దూకుడు అందుకు కలిసి వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఐపీఓల ద్వారా పలు కంపెనీలు రూ.31,000 కోట్లు సమీకరించాయి. 2021-22లోనూ ఐపీఓల జోరు కొనసాగనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు దిగ్గజ సంస్థలు..

ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో ఐపీఓల ద్వారా రూ.28,710 కోట్ల సమీకరణ జరగనుందని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ సీఈఓ(రిటైల్‌) సందీప్‌ భరద్వాజ్‌ తెలిపారు. ఇందుకోసం 28 కంపెనీలు ఇప్పటికే మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీ నుంచి అనుమతులు తీసుకొని సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఎల్‌ఐసీ, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎన్‌సీడీఈఎక్స్‌, ఈఎస్‌ఏఎఫ్‌ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌ వంటి కంపెనీలు దిగ్గజ సంస్థలు వచ్చే సంవత్సరమే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అవకాశం ఉన్నట్లు సెంట్రమ్‌ క్యాపిటల్‌ ఎండీ రాజేంద్ర నాయక్‌ తెలిపారు.

ఐపీఓల రాణింపునకు కారణాలివే..

స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది 30 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. రూ.31,277 కోట్లు సమీకరించాయి. క్రితం ఏడాది 13 కంపెనీల ఐపీఓల్లో రూ.20,352 కోట్లు సమకూరాయి. 2018-19లో 14 కంపెనీలు ఐపీఓకి రాగా.. రూ.14,719 కోట్లు, 2017-18లో 45 కంపెనీలు రూ.82,109 కోట్లు సమీకరించాయి. ప్రపంచ విపణిలో ద్రవ్యలభ్యత, కొత్త రంగాల్లో ఉన్న అవకాశాలు, మదుపర్ల ఆసక్తి, ఊహించిన దానికంటే వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం వంటి అంశాలు ఐపీఓలు రాణించడానికి దోహదం చేశాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.

భారీగా పెట్టుబడులు సమీకరించిన సంస్థలివే..

ఈ ఏడాది ఐపీఓకి వచ్చిన గ్లాండ్ ఫార్మా రూ.6,480 కోట్లు, ఐఆర్‌ఎఫ్‌సీ రూ.4,633, సీఏఎంఎస్‌ రూ.2,240 కోట్లు, యూటీఐ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ రూ.2,160 కోట్లు సమీకరించాయి. వీటితో పాటు రొస్సారీ బయోటెక్‌, కల్యాణ్‌ జువెల్లర్స్‌, బార్బెక్యూ నేషన్‌, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌, హోం ఫస్ట్‌ ఫినాన్స్‌, సూర్యోదయ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌ ఈ ఏడాది ఐపీఓకి వచ్చిన ప్రముఖ కంపెనీల జాబితాలో ఉన్నాయి.

ఈ కంపెనీలకు భారీ స్పందన..

ఈ ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన సంస్థల్లో ఎంటార్‌ టెక్నాలజీస్‌కు భారీ స్పందన లభించింది. ఈ కంపెనీ షేర్లు 200 శాతం సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. తర్వాత మిసెస్‌ బెక్టార్స్‌ ఫుడ్‌ స్పెషాలిటీస్‌ షేర్లకు 198 శాతం స్పందన లభించింది. వీటితో పాటు బర్గర్‌ కింగ్‌ ఇండియా, నజారా టెక్‌, లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌, మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌, హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్‌, ఇండిగో పెయింట్స్‌, కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ 100 శాతానికి పైగా సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. ఇక స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన తర్వాత రూట్‌ మొబైల్‌, హ్యాపియెస్ట్‌ మైండ్స్ టెక్నాలజీస్‌, రొస్సారీ బయోటెక్‌, బర్గర్‌ కింగ్‌ ఇండియా, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫినాన్స్‌ బ్యాంక్‌ 84-314 శాతం లాభపపడం గమనార్హం.

ఇదీ చదవండి:అమెజాన్​ ఫ్రీ గిఫ్ట్​.. లింక్​ క్లిక్​ చేస్తే అంతే!

ABOUT THE AUTHOR

...view details