డిసెంబర్ 15 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇకపై జాతీయ రహదార్లపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ తప్పని సరికానుంది. ఈ నేపథ్యంలో చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే. ఫాస్టాగ్ ఎక్కడ.. ఎలా పొందాలి. డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ లేకపోతే ఏమవుతుంది అని.. వీటితో పాటు ఫాస్టాగ్ పై ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.
ఫాస్టాగ్ అంటే ఏమిటి?
జాతీయ రహదార్లపై ప్రయాణించే వాహనాలు టోల్ గేట్ల వద్ద రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ.. నగదు రూపంలో చెల్లిపులు జరపడం ద్వారా భారీగా ట్రాఫిక్ స్తంభించడం, ఎక్కువ సమయం వృథా అవుతోంది. వాహనదారులు అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) కార్యక్రమానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2014లో పైలట్ ప్రాజెక్టుగా ఫాస్టాగ్ను ప్రారంభించారు. ఇప్పుడు డిసెంబర్ 15 నుంచి తప్పనిసరి చేసింది కేంద్రం.
ఇకపై ఫాస్టాగ్ లేకపోతే..
డిసెంబర్ 15 నుంచి ఫాస్టాగ్ లేని వాహనాలు ఫాస్టాగ్ లైన్లోకి వస్తే.. సాధారణ ధరల కన్నా రెండింతలు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయనున్నారు. రేపటి నుంచి జాతీయ రహదార్లపై ఉన్న టోల్ప్లాజాల్లో.. కేవలం ఒక లైన్ మాత్రమే హైబ్రిడ్ లైన్ ఉండనుంది. ఇందులో సాధారణ టోల్ ఛార్జీలనే వసూలు చేయనున్నారు.
ఫాస్టాగ్ ఎందుకు..?
టోల్ప్లాజాల వద్ద వాహనం ఆగకుండా వెళ్లిపోయేందుకు వీలుగా ఉపయోగపడే చిన్న సాంకేతిక సాధనమే ఈ ఫాస్టాగ్. నగదు రహిత, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. చిన్న ఎలక్ట్రానిక్ చిప్ రూపంలో ఉండే దీన్నీ... వాహనం ముందుండే అద్దం లోపలివైపు అతికిస్తారు. వాహనం టోల్ప్లాజా లైన్లోకి రావడంతోనే అక్కడ అమర్చిన ఎలక్ట్రానిక్ పరికరం వాహన ఫాస్టాగ్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు, మన పేరును గుర్తించి, ఖాతా నుంచి టోల్ రుసుంను ఆన్లైన్లోనే తీసుకుంటుంది. ఇదంతా 10 సెకండ్లలోనే జరుగుతుంది.
ఎక్కడ... ఎలా తీసుకోవాలి..?
అన్ని టోల్ప్లాజాలు, 22 ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకుల్లో దీన్నీ పొందవచ్చు. త్వరలో ఎన్హెచ్ఏఐ సొంతంగానూ ఇవ్వనుంది. అమెజాన్, పేటీఎంల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ చిప్ను టోల్ప్లాజాలో ఏర్పాటు చేసిన బ్యాంకు సేల్ పాయింట్లలో ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలి. చిప్ పొందడానికి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), వాహనదారుడి గుర్తింపు కార్డు జిరాక్స్ ప్రతులు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలి.
కీలక నిర్ణయం...
ఫాస్టాగ్ విషయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. వాహనదారులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 25 శాతం ఫాస్టాగ్ లేన్స్ను తాత్కాలికంగా హైబ్రిడ్ లేన్స్గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేన్లలో అటు ఫాస్టాగ్తో పాటు నగదు చెల్లింపులనూ అనుమతిస్తారు. అయితే నెలరోజుల పాటు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ వెసులుబాటు కల్పించింది. మిగిలిన 75 శాతం లేన్లు మాత్రం ఫాస్టాగ్ లేన్లుగానే ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఫాస్టాగ్కు సంబంధించిన ఎలాంటి సహాయం కోసమైనా 1033కి ఫోన్ చేయాలని సూచించింది.