తెలంగాణ

telangana

టీకాల తయారీకి 'లుపిన్‌' సన్నాహాలు

By

Published : May 14, 2021, 7:33 AM IST

దేశంలో కరోనా ఔషధాలకు ప్రాధాన్యం ఏర్పడిన వేళ.. వాటిని అందించేందుకు దేశీయ ప్రముఖ ఔషధ కంపెనీ లుపిన్​ లిమిటెడ్​ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం విదేశీ భాగస్వామ్యాల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు ఆ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ తెలిపారు.

Lupin Company
లుపిన్‌, వ్యాక్సిన్​

దేశీయ అగ్రశ్రేణి ఔషధ కంపెనీల్లో ఒకటైన లుపిన్‌ లిమిటెడ్‌.. కొవిడ్‌-19 ఔషధాలు, టీకాను పెద్దఎత్తున అందించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం విదేశీ భాగస్వామ్యాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. 'మెర్క్‌, ఫైజర్‌ సంస్థల వద్ద కొవిడ్‌-19 ఔషధాలు ఉన్నాయి. వాటిని భారత విపణిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం' అని లుపిన్‌ లిమిటెడ్‌ ఎండీ నీలేశ్​ గుప్తా తెలిపారు. కొవిడ్‌-19 టీకా తయారీకి నాగ్‌పుర్‌లోని తమ యూనిట్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. 'మేం ఇంతవరకూ టీకాల తయారీలో లేం. కానీ, నాగ్‌పుర్‌లో మాకొక యూనిట్‌ ఖాళీగా ఉంది. దాన్ని సిద్ధం చేసి టీకాల తయారీకి వినియోగించవచ్చు' అన్నారాయన.

యాంటీ-వైరల్‌ ఔషధమైన రెమ్‌డెసివిర్‌ తయారీకి అనుమతి కోరుతూ తాము పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉందని చెప్పారు నీలేశ్​. పేటెంట్‌ హక్కులపై తమకు గౌరవం ఉందని.. అందువల్ల ఈ ఔషధానికి సంబంధించి 'వాలంటరీ లైసెన్స్‌' కోసం గిలీడ్‌ సైన్సెస్‌తో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నామని అన్నారు. ఎలి లిల్లీతో వాలంటరీ లైసెన్స్‌ ఉన్నందున 'బారిసిటినిబ్‌' ఔషధాన్ని రెండు మూడు నెలల్లో దేశీయ విపణిలో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. కొవిడ్‌-19 బాధితులకు పలు రకాల స్టెరాయిడ్లను వైద్యులు సిఫారసు చేస్తున్న నేపథ్యంలో.. తాము స్టెరాయిడ్‌ ఔషధాల తయారీని పెంచుతున్నట్లు నీలేశ్​ గుప్తా వివరించారు.

ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ నుంచి 'బారిసిటినిబ్‌'

హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌, బారిసిటినిబ్‌ ట్యాబ్లెట్లు తయారు చేసేందుకు ఎలి లిల్లీతో 'వాలంటరీ లైసెన్సింగ్‌' ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా బాధితులకు త్వరగా ఉపశమనం కలిగించడానికి 'రెమ్‌డెసివిర్‌' ఔషధంతో కలిసి బారిసిటినిబ్‌ ట్యాబ్లెట్‌ ఇస్తున్నారు. 'బారిడోజ్‌' బ్రాండు పేరుతో 2ఎంజీ, 4ఎంజీ డోసుల్లో దీన్ని త్వరలో దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ సీఎండీ ఎంఎస్‌ఎన్‌ రెడ్డి తెలిపారు. 'బారిసిటినిబ్‌' ఔషధాన్ని మనదేశంలో ఉత్పత్తి చేసి విక్రయించడానికి టోరెంట్‌ ఫార్మా తోనూ ఎలి లిల్లీ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చదవండి:'18 ఏళ్లు నిండితే వ్యాక్సిన్‌'..అని కేంద్రం చెప్పినా..!

ABOUT THE AUTHOR

...view details