తెలంగాణ

telangana

'కరోనా ప్రభావిత రంగాలకు మరో ప్యాకేజీ కావాల్సిందే'

By

Published : Jun 30, 2020, 6:53 AM IST

కరోనా మహమ్మారి వల్ల ప్రభావితమైన రంగాలు మరింత పుంజుకోవటానికి రెండో దఫా ఉద్దీపన ప్యాకేజీ కూడా అవసరమని ఎస్​బీఐ ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. రుణ వాయిదాలపై మారటోరియం ముగిస్తే.. బ్యాంకులు నికర నిరర్థక ఆస్తులను ఎక్కువగా చూపించే అవకాశం ఉందని హెచ్చరించారు.

COVID-19: SBI economists pitch for 2nd round of financial package for impacted sectors
కరోనా ప్రభావిత రంగాలకు మరో ప్యాకేజీ అవసరం

ప్రస్తుత స్టాక్‌ మార్కెట్ల దూకుడుకు, ఆర్థిక రికవరీకి ఎటువంటి సంబంధం లేదని.. వృద్ధిపై హేతుబద్ధత లేని అంశాల ప్రభావం ఉండొచ్చని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కరోనా వల్ల ప్రభావిత రంగాలకు రెండో దఫా ఉద్దీపన ప్యాకేజీ కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. రుణ వాయిదాలపై ఆరు నెలల మారటోరియం ముగిస్తే.. సెప్టెంబరు తర్వాత బ్యాంకులు నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)ను అధికంగా చూపించే అవకాశం ఉందని హెచ్చరించారు. కొవిడ్‌-19 మహమ్మారి ప్రారంభంలో మార్కెట్లు దాదాపు 20 శాతం కుప్పకూలాయి. అయితే గత కొన్ని వారాల్లో బలంగా పుంజుకున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ మైనస్‌లోకి వెళ్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నప్పటికీ.. మార్కెట్లు గణనీయంగా లాభపడటం గమనార్హం. మార్కెట్లు, ఆర్థిక రికవరీకి అతి చిన్న సంబంధం ఉందని, ఆర్‌బీఐ అందుబాటులోకి తీసుకొచ్చిన నగదు లభ్యత కొంత కలిసొస్తుందని ఆర్థికవేత్తలు తెలిపారు. మంచి ఆర్థిక వ్యవస్థను లాభాలిస్తున్న మార్కెట్లు ప్రతిబింబించవని అన్నారు. ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించింది. అయితే వాస్తవ వ్యయం ప్యాకేజీలో పదోవంతు మాత్రమే అని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

ప్రస్తుతం రుణాలతో పోలిస్తే బ్యాంకు డిపాజిట్లు వేగంగా పెరుగుతున్నాయని, దేశంలో సామాజిక భద్రత కొరవడటం వల్ల డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీపై ఎక్కువ శాతం మంది ఆధారపడ్డారని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు విలాస వస్తువులు నుంచి నిత్యావసరాల కొనుగోళ్లకే మొగ్గుచూపారని గుర్తుచేశారు. సగటు క్రెడిట్‌ కార్డు లావాదేవీలు రూ.12000 నుంచి రూ.3600కు, డెబిట్ కార్డు విషయంలో రూ.1000 నుంచి రూ.350కు తగ్గాయని వివరించారు.

ఇదీ చూడండి:టిక్​టాక్​కు 'స్వదేశీ' సవాల్​- దూసుకెళ్తున్న చింగారీ!

ABOUT THE AUTHOR

...view details