జీఎస్టీ రిటర్నులపై వ్యాపారులకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు.. ఇక నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్నులు లేదా జీఎస్టీఆర్-3బీని దాఖలు చేస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఇది అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ పరిధిలోకి వచ్చే వ్యాపారాలు ప్రస్తుతం 12 జీఎస్టీ రిటర్నులు సమర్పిస్తున్నాయి.
నెలవారీ చెల్లింపుతో త్రైమాసిక రిటర్నుల ఫైలింగ్(క్యూఆర్ఎంపీ) పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం వల్ల 94 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. మొత్తం జీఎస్టీలో 92 శాతం ఈ వ్యాపారాల నుంచే వస్తోందని చెప్పారు. మరోవైపు, ఈ పథకంలో భాగంగా చిన్నస్థాయి చెల్లింపుదారులు ఏడాదికి ఎనిమిది(నాలుగు జీఎస్టీఆర్-3బీ, నాలుగు జీఎస్టీఆర్-1) రిటర్నులు సమర్పిస్తే సరిపోతుందని చెప్పారు.