బిట్కాయిన్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలెన్ మస్క్ను కూడా ఊరించింది. దానిని కొననందుకు మస్క్ ట్విటర్లో చాలాసార్లు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఒక్క మస్కే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలామంది బిట్కాయిన్ కొననందుకు తమను తాము నిందించుకొన్నారు. కానీ, ఇప్పుడు మెల్లగా పరిస్థితి మారుతోంది. బిట్కాయిన్ ఒక్క ఏడాదిలో ఎంత వేగంగా విలువను సంపాదించుకొందో.. అంతే వేగంగా కోల్పోతోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు 30శాతానికి పైగా విలువ కోల్పోయింది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి చైనా.. రెండోది ఎలెన్ మస్క్.
క్రిప్టోలపై విరుచుకు పడుతున్న డ్రాగన్..
చైనా 2019లో క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్ను నిషేధించింది. కానీ ప్రజలు బిట్ కాయిన్ ఆన్లైన్ వంటి ప్లాట్ఫామ్లపై ట్రేడింగ్ చేస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన బీజింగ్ వరుసగా ఆంక్షలు విధిస్తూ వస్తోంది. తాజాగా మంగళవారం చైనాకు చెందిన ది నేషనల్ ఇంటర్నెట్ ఫైనాన్స్ అసోసియేషన్ ఆఫ్ చైనా, ది చైనా బ్యాంకింగ్ అసోసియేషన్, ద పేమెంట్ అండ్ క్లియరింగ్ అసోసియేషన్ ఆఫ్ చైనా అనే ప్రభుత్వ రంగ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టినా, వాటి లావాదేవీల్లో పాల్గొన్నా.. వాటిలో నష్టాలకు ఎటువంటి రక్షణ ఉండదని తేల్చి చెప్పాయి. బిట్కాయిన్ విలువలో అత్యంత వేగంగా జరిగే మార్పులు ప్రజల ఆస్తుల భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నాయని వివరించాయి. చైనా బలంగా క్రిప్టో కరెన్సీలను అడ్డుకోవడం వల్ల మిగిలిన దేశాలు కూడా ఆ పని చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫేస్బుక్ లిబ్రా కరెన్సీని కూడా చైనా నిందించింది. ప్రభుత్వ బ్యాంకులే క్రిప్టోకరెన్సీలను నిర్వహించాలని పేర్కొంది.
చైనాలో కరెంటు పోతే..
వినియోగంపై నిషేధం ఉన్నా సరే ప్రపంచంలోని బిట్కాయిన్లలో 75శాతం మైనింగ్ చైనాలోనే చేస్తారు. వీటిని సృష్టించడానికి భారీగా విద్యుత్తు అవసరమవుతుంది. చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్స్లో ఏప్రిల్ మూడోవారంలో విద్యుత్తు ఉత్పత్తి సంస్థల్లో సమస్యలు వచ్చాయి. విద్యుత్తును నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా బిట్కాయిన్ విలువ 14శాతం వరకు పడిపోయింది. దీనిని బట్టే బిట్కాయిన్లపై చైనా పట్టు అర్థమవుతుంది.
మాటమార్చిన మస్క్