దేశంలోని 10 ప్రభుత్వరంగ బ్యాంకులను 4 బ్యాంకుల్లో విలీనం చేయబోతున్నట్లు నిరుడు ఆగస్టులో భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏప్రిల్ ఒకటో తేదీ (నేటి) నుంచి అమలులోకి రానున్న విలీన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రిమండలి కొన్ని రోజుల క్రితం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. 2017లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన వివిధ అనుబంధ శాఖలు ఎస్బీఐలో విలీనమయ్యాయి. ఆ తరవాత దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ నిరుడు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్బీ)ల విలీనం జరుగుతుందన్న సంకేతాలే ప్రభుత్వం నుంచి అందుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు కలిసిపోయి రూ.18 లక్షల కోట్ల వ్యాపార విలువ కలిగిన ఏకరూప వ్యవస్థగా, ఎస్బీఐ తరవాత అత్యధిక బ్రాంచీలున్న రెండో అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనున్నాయి. సిండికేట్ బ్యాంకులో కెనరా బ్యాంక్ విలీనం వల్ల రూ.15.2 లక్షల కోట్ల వ్యాపార విలువతో దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఏర్పడనుంది. బ్యాంకు శాఖల ప్రాతిపదికన ఈ పీఎస్బీ దేశంలో మూడో స్థానంలో నిలువనుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు కలిసి రూ.14.6 లక్షల కోట్ల వ్యాపారంతో దేశంలోనే మూడో అతిపెద్ద విలీనం ఆవిష్కారం కానుంది. అత్యధిక బ్యాంకు శాఖలున్న నాలుగో పీఎస్బీగానూ ఇది అవతరించనుంది.
గ్రామీణ ప్రజలకు చేరువగా...
భారత్లో 2019 సెప్టెంబరు చివరినాటికి అన్ని రకాల షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకు(ఎస్సీబీ)లకు పాలన కార్యాలయాలను మినహాయిస్తే మొత్తం 1,47,903 బ్రాంచీలున్నాయి. 2006 మార్చి 31న ఈ బ్రాంచీల సంఖ్య 69,330గా ఉంది. పదమూడేళ్ల నాటితో పోలిస్తే వివిధ బ్యాంకుల బ్రాంచీలు దేశవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా విస్తరించాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ్ బంగ, కేరళల్లో బ్యాంకు శాఖలు రెట్టింపయ్యాయి. గ్రామాల్లోని బ్యాంకు శాఖల సంఖ్య 52,489గా ఉంది. 2019 మార్చి నాటికి భారతీయ బ్యాంకింగ్ రంగంలో మొత్తం ఆస్తుల విలువ రూ.1,66,01,224 కోట్లు; డిపాజిట్లు రూ.1,28,87,262. రుణాలు, అడ్వాన్సుల రూపంలో తీసుకున్న మొత్తం రూ.97.09 లక్షల కోట్లు. గడచిన ఏడేళ్ల కాలంలో బ్యాంకుల ద్వారా దేశంలోని పౌరులకు చెల్లించిన రుణాల సగటు విలువ రెట్టింపయింది. నిరర్థక ఆస్తుల సమస్యవల్ల 2019లో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు రూ.23,397కోట్లు వచ్చాయి. ఎక్కడికక్కడ బ్యాంకుల ఏర్పాటుతోపాటు అన్ని ప్రాంతాలకూ ఏటీఎమ్లు విస్తరించడంతో బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజలకు బాగా చేరువయింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం దేశంలోని అన్ని ఎస్సీబీలకు 2019 మార్చి నాటికి కలిసి మొత్తం 2,00,532 ఏటీఎమ్లు ఉన్నాయి. 2006 మార్చిలో దేశంలోని ఏటీఎమ్ల సంఖ్య 21,147 మాత్రమే! 2006 నుంచి భారత్లో బ్యాంకింగ్ విస్తరణ కొత్త పుంతలు తొక్కింది. దేశంలో ప్రస్తుతం 5.41 లక్షల విభాగాలున్నాయి. ఇవి చాలావరకు చిన్న పట్టణాలు, గ్రామాల్లో అధికంగా ఉండటం గమనార్హం.
విలీనం వల్ల 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు కోసుకుపోనుంది. మరోవంక పీఎస్బీల విలీనంతో ఒక్కో బ్యాంకు బ్యాలెన్స్ షీట్ పరిమాణం బాగా పెరగనుంది. ఫలితంగా 12 పీఎస్బీల్లో ఏడింట ఎనిమిది లక్షల కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వ్యాపారం చోటుచేసుకోనుంది. విలీనాల ద్వారా బ్యాంకుల స్థిరీకరణ జరుగుతున్న తీరు అనేక కీలక ప్రశ్నలకు తెర తీస్తోంది. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి జరుగుతుందా; ఉద్యోగాలకు పెద్దయెత్తున కోతపడే ప్రమాదం ఉందా, దేశంలోని బ్యాంకు శాఖలు గణనీయంగా తగ్గిపోతాయా; దీనివల్ల సేవల నాణ్యత ఇనుమడించనుందా లేక దారుణంగా దెబ్బతిననుందా... వంటి అనేక ప్రశ్నలకు జవాబులు అన్వేషించాల్సి ఉంది. ఈ తరహా విలీనాలు చాలాసార్లు జవాబులకన్నా ప్రశ్నలనే ఎక్కువగా మిగులుస్తుంటాయి. ఈ విలీనంవల్ల ఉద్యోగులకు ఎలాంటి ముప్పూ ఉండదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. విలీనాల ద్వారా పీఎస్బీల పరిమాణం పెరగడంతోపాటు- వాటి బ్యాలెన్స్ షీట్ ఇనుమడిస్తుందని, దానివల్ల పెట్టుబడి అవసరాలను నెరవేర్చుకోవడానికి సంబంధించి వెసులుబాటు లభిస్తుందని తద్వారా ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పోటీ వాతావరణాన్ని తట్టుకుని నిలబడటం సాధ్యపడుతుందని ఈ చర్యను సమర్థించేవారు వాదిస్తున్నారు. విలీనాల ద్వారా భారీ పీఎస్బీల ఆవిష్కరణవల్ల ‘షేర్ హోల్డర్’ విలువ ఇనుమడిస్తుందని, భవిష్యత్తులో ఎప్పుడైనా పెట్టుబడుల ఉపసంహరణకు వెళ్లినా ప్రయోజనం చేకూరుతుందని విధాన రూపకర్తల ఆలోచన.
భారత్ వంటి దేశానికి బ్యాంకులు విరివిగా ఉండాలి. పరిమాణంపరంగా పెద్ద బ్యాంకులు ఉంటే సరిపోదు. మరీ ముఖ్యంగా దేశంలో పెద్దయెత్తున బ్యాంకు శాఖలను విస్తరించాల్సిన అవసరం ఉంది. భారత జనాభాలో అటు ఇటుగా నాలుగోవంతు ఉన్న అమెరికాలో- ఎఫ్డీఐసీ వద్ద బీమా చేయించుకున్న 77వేల వాణిజ్య బ్యాంకులున్నాయి. భారత్ పెట్టుబడులపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశం కాబట్టి, మదుపుదారుల నుంచి డబ్బు సేకరించి కావలసినవారికి ఆ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు బ్యాంకులను మించిన సాధనాలు లేవు. దేశంలో ఇప్పుడు సగటున 8,700 జనాభాకు ఒక బ్యాంకు శాఖ ఉంది. 1969లో సగటున 64వేల మందికి ఒక బ్యాంకు శాఖ ఉండేది. అయిదు దశాబ్దాల్లో దేశ జనాభా కనీసం మూడు రెట్లు పెరిగింది.