తెలంగాణ

telangana

ETV Bharat / business

విమాన ప్రయాణాలు ప్రారంభమైనా.. లాభాలు గగనమే! - aviation may not get enough profits even its started its operations post lockdown

లాక్‌డౌన్‌తో విమానయాన రంగానికి రెండు నెలలపాటు నష్టాలు తప్పలేదు. దేశాలన్నీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల చాలా వరకు సేవలు నిలిచిపోయాయి. దేశంలో ప్రస్తుతం సేవలు పునఃప్రారంభమైనా.. పరిస్థితి వెంటనే మారేలా లేదు. నష్టాల వల్ల ప్రయాణికులపై అదనపు సుంకాల భారం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

aviation
విమాన ప్రయాణాలు ప్రారంభమైనా.. లాభాలు గగనమే!

By

Published : Jun 5, 2020, 6:56 AM IST

Updated : Jun 5, 2020, 9:31 AM IST

చైనాలో కొవిడ్‌-19 తొలి కేసు నమోదు కాకముందు ఏ రోజు చూసినా ప్రపంచ గగనతలంలో సుమారు 20 వేలకు తగ్గకుండా పౌర విమానాలు ఎగురుతూ ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. మనదేశంలోనూ దాదాపు 600 విమానాలు నిలిచిపోయినా, ప్రస్తుతం మూడోవంతు కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల రెండున్నర నెలల పాటు తీవ్రంగా నష్టపోయిన విమానయాన సంస్థలు, జవసత్వాలు కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్నా... పరిస్థితి వెంటనే మారేలా లేదు. అయితే ఫిబ్రవరి నాటి ధరలతో పోలిస్తే, విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర ఇప్పుడు సగం మేర ఉండటమే విమానయాన సంస్థలకు ప్రధాన ఊరట కల్పించే అంశం. విమానాల నిర్వహణ వ్యయంలో ఇంధన వాటాయే 40 శాతం కావడం గమనార్హం. ఏ సంస్థ నిర్వహించే విమానాలు అయినా, లీజుకు తీసుకున్నవే అధికం.

లాభాలు గగనమే!

ఇందుకు దేశీయ సంస్థలైతే కనీసం రూ. 2కోట్లు-రూ.4 కోట్లు నెలవారీ చెల్లించాల్సిందే. వీటిపై లీజింగ్‌ సంస్థలు, విమానయాన సంస్థలు సంప్రదింపులు చేసుకుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. దాదాపు రెండున్నర నెలలుగా వాటిని ఉపయోగించకున్నా అద్దె మాత్రం డాలర్లలో చెల్లించాల్సిందే. ఈ రెండు నెలల్లో రూపాయి కొంత బలహీన పడటం దేశీయ సంస్థలకు అదనపు భారమైంది. విమానాలు నిలిపి ఉంచినందుకు విమానాశ్రయాలకు చెల్లించాల్సిన ఛార్జీలు (కనీసం రోజుకు రూ.25వేలు-రూ.50వేలు), నిర్వహణ వ్యయాలు వంటి అంశాల్లో ప్రభుత్వాలు సహకరిస్తే, ఈ రంగం త్వరగా కోలుకునే వీలుంది. కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఏసీ రైలులో 36-48 గంటలు ప్రయాణించే దూరాన్ని 3-4 గంటల్లో చేరగలగడంతో పాటు విమానాశ్రయాల్లోనూ, విమానాల్లోనూ వైరస్‌ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో దూర ప్రయాణాలకు విమానాలను ఆశ్రయిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.

నష్టాల ఫలితంగా వేతన కోతలు

అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకం, ఆతిథ్యం, క్రీడలు, వినోదం... ఇవన్నీ విమానయానంతో ముడిపడిన రంగాలు. లాక్‌డౌన్‌ ఫలితంగా ఇవన్నీ స్తంభించాయి. రాకపోకలు లేక విమానయాన సంస్థలు దివాలా అంచుకు చేరిన స్థితి అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ... ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. భారత విమానయాన పరిశ్రమకు సైతం రూ.25,000 కోట్ల మేరకు ఆదాయ నష్టం ఉంటుందని ఇటీవల ‘క్రిసిల్‌’ ఒక నివేదిక పేర్కొంది. దేశీయ అగ్రగామి సంస్థ ఇండిగో 2019-20 నాలుగో త్రైమాసికానికి రూ.870 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. స్పైస్‌జెట్‌, ఎయిర్‌ ఏషియా, విస్తారా, గో ఎయిర్‌... తదితర సంస్థలన్నీ నష్టాలు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఆయా సంస్థలన్నీ ఉద్యోగాలు, జీతభత్యాల్లో కోత వంటి చర్యలను చేపట్టాయి.

ఇవీ సానుకూలతలు

  • లాక్‌డౌన్‌ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారు, టికెట్టు ధర అధికంగా ఉన్నా విమాన ప్రయాణాలకు సిద్ధపడుతున్నారు.
  • సమీపకాలంలో విమాన ఇంధనం(ఏటీఎఫ్‌) ధరల్లో పెద్దగా మార్పు ఉండదనే అంచనాలు.
  • సరకు రవాణాకు కొన్ని సంస్థలు సాధారణ విమానాలనే వినియోగించడం, ఉడాన్‌ కింద చిన్న నగరాలకు సేవలను ప్రారంభించడం కలిసొచ్చే అంశం.

ఏడాది వరకూ ఇంతేనా...?

ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగుల దేశవిదేశీ ప్రయాణాలపై నియంత్రణ విధించవచ్చు. ఫలితంగా విమానయాన సంస్థలకు బాగా లాభాలు వచ్చే ‘బిజినెస్‌ క్లాస్‌’ సీట్లకు గిరాకీ తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఐటీ రంగంలో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ పెరిగినందున, ఈరంగం నుంచీ ప్రయాణాలకు డిమాండ్‌ తగ్గింది. ఉద్యోగాలు పోవడం, జీతభత్యాల్లో కోతలు, వ్యాపార ఆదాయాలు తగ్గడం... వంటి మార్పులతో విహార, కుటుంబ ప్రయాణాలు తగ్గిపోతాయి. అందుకే విమానయాన పరిశ్రమ సాధారణ స్థితికి వచ్చేందుకు 6-12 నెలల వరకు పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన పథకాల్లో... విమానయాన రంగానికి ఎటువంటి ఊరట లభించలేదు. విమానాశ్రయ ఛార్జీలు తగ్గించడం, ఇంధనంపై సుంకాలు తగ్గించడంతోపాటు ఇతర ప్రోత్సాహకాలు ఇస్తే సాధారణ పరిస్థితులు కొంత వేగంగా వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ప్రయాణికులపై భారం పెరుగుతోంది

  • విమానయాన సంస్థల నష్టాల భారమంతా తిరిగి వినియోగదార్ల మీదే పడుతుందనే వాదన ఉంది. బెంగళూరు విమానాశ్రయంలో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీలను అంతర్జాతీయ ప్రయాణాలపై 17%, దేశీయ ప్రయాణాలపై 3% పెంచారు.
  • ప్రయాణికుల నుంచి బుకింగ్‌ రుసుంగా రూ.300 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నాయి.
  • పెద్దవాళ్లు లేకుండా చిన్నారులను, ఒంటరిగా విమానంలో పంపితే, టికెట్‌ వ్యయం కాకుండా, వారి పర్యవేక్షణకు రూ.1500 చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.2000కు పెంచారు.
Last Updated : Jun 5, 2020, 9:31 AM IST

For All Latest Updates

TAGGED:

aaviation

ABOUT THE AUTHOR

...view details