దేశ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి కాలుదువ్వుతున్న చైనా మరో తరహా యుద్ధానికి సిద్ధమవుతోంది. బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి సొమ్ము కాజేసే 'సైబర్ యుద్ధం' చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనిపై అప్రమత్తమైన ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. దేశంలో సైబర్ భద్రత వ్యవహారాలు చూసే ఉన్నత స్థాయి సంస్థ అయిన ఈసీఆర్టీ-ఇన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం- ఇండియా) దీనిపై హెచ్చరికలు జారీ చేసింది కూడా. కరోనా నేపథ్యంలో సాయం చేస్తామంటూ ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంఘాల పేరుతో తప్పుడు ఈ-మెయిల్స్ వస్తాయని, వాటిని తెరిచి చూస్తే నష్టం జరుగుతుందని పేర్కొంది. సైబర్ రంగంలో ఈ తరహా మోసాలను 'ఫిషింగ్'గా వ్యవహరిస్తుంటారు. ఈ సైబర్ నేరాల తీరుతెన్నులు, నివారణ చర్యలపై 'ఈటీవీ భారత్' పలువురు నిపుణులను సంప్రదించింది.
ఆ దేశాల నుంచి సైబర్ దాడుల ముప్పు..
"ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే చైనా, పాకిస్థాన్, ఉత్తర కొరియాల నుంచి సైబర్ దాడులు జరిగే సూచనలు కనిపిస్తున్నయని జాతీయ సైబర్ భద్రత విభాగం మాజీ అధిపతి గుల్షన్ రాయ్ తెలిపారు. వ్యక్తిగతంగాగానీ, సామూహికంగాగానీ దాడులు చేసే అవకాశం ఉందన్నారు.
'ఆర్థికం, గూఢచర్యం, సైన్యపరమైన కారణాలతో ఈ దాడులకు దిగుతారు. ఈ కారణాలు ఎలా ఉన్నప్పటికీ భారతీయుల్లో గందరగోళం, ఆందోళన కలిగించడం వారి తక్షణ ఉద్దేశం. కీలకమైన సమాచారాన్ని అపహరించడం వారి దీర్ఘకాలిక వ్యూహం' అని చెప్పారు.
'భారతీయులకు సంబంధించిన ఈ-మెయిళ్లు, ఇతర సమాచారాన్ని ఏ దేశం వారు ఎక్కువగా చూస్తున్నారు, ఏయే అంశాలను పరిశీలిస్తున్నారు అన్న అంశాల ఆధారంగా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందా లేదా అని పరిశీలిస్తాం.' అని సైబర్ దాడులు జరుగుతాయని ఎలా గుర్తిస్తారన్న ప్రశ్నకు సమాధానంగా వివరించారు. ఈ ట్రాఫిక్, ట్రెండ్ను గమనిస్తే చాలు విషయం అర్థమయిపోతుంది. తాజా పరిస్థితిని విశ్లేషిస్తే అతి తక్కువ సమయంలోనే సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందన్న అంచనాలున్నాయని గుల్షన్ రాయ్ వెల్లడించారు.