అమెజాన్ సంస్థ తయారు చేసి విక్రయించే పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేయాలని ఆ సంస్థ భారతీయ విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్పై ఎక్కువగా దృష్టిపెట్టడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు నేడు ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిలో భాగంగా తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ సంస్థ చెన్నై విభాగంతో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ విభాగం ఐఫోన్, ఐపాడ్స్, షావోమి పరికరాలను తయారు చేస్తోంది. ఫైర్ టీవీ స్టిక్స్ పరికరాలను భారీఎత్తున చెన్నై ప్లాంట్లో తయారు చేయాలని అమెజాన్ భావిస్తోంది. అవసరన్ని, డిమాండ్ను బట్టి వీటి తయారీని ఇతర పట్టణాలకు విస్తరించే అవకాశం ఉంది.
'ఆత్మనిర్భర్ భారత్ విషయంలో ఇక్కడి ప్రభుత్వానికి భాగస్వామిగా ఉండేందుకు కట్టుబడి ఉన్నాము. మేము 10లక్షల చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను డిజిటలైజేషన్ చేసేందుకు 1బిలియన్ డాలర్లను వెచ్చిస్తాము. ఇది ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు మార్కెట్ లభించి 10 బిలియన్ డాలర్ల వరకు ఎగుమతులు చేసే అవకాశం ఉంది. ఇది 2025 నాటికి దాదాపు పది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది' అని అమెజాన్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు.