అమెజాన్, ఫ్లిప్కార్ట్ అమ్మకాల్లో స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, ఫర్నిచర్, గృహోపకరణాలు లాంటి ఉత్పత్తులదే సింహభాగం. ఈ కంపెనీలకు 90 శాతానికి పైగా ఆదాయం వీటి నుంచే వస్తుందని ఓ అంచనా. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఉండటంతో కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే అమ్మేందుకు అనుమతి ఉంది. పైవన్నీ అత్యవసరం కాని వస్తువుల విభాగం కిందకు వస్తుండటంతో వాటిని అమ్మే వీల్లేదు. పైగా చాలా వస్తువులను ఈ విభాగంలోకి చేర్చడంతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఆదాయాలపైనా ఈ ప్రభావం పడింది. దేశంలోని దిగ్గజ ఇ-కామర్స్ సంస్థల పరిస్థితే ఇలా ఉంటే.. లెన్స్కార్ట్, ఫస్ట్క్రై, నైకా లాంటి చిన్న సంస్థల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు 14వ తేదీ తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించి, అత్యవసరం కాని వస్తువుల అమ్మకాలపై ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఈ సంస్థలకు ఏప్రిల్ నెల పీడకలను మిగిల్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కోలుకునేందుకు మూడు నెలలు..
లాక్డౌన్ కారణంగా ఈ మూడు వారాల్లో పడిన ప్రతికూల ప్రభావం నుంచి కోలుకునేందుకు ఇ-కామర్స్ సంస్థలకు కనీసం మూడు నెలలైనా సమయం పడుతుందని ఫోస్టర్ రీసెర్చ్కు చెందిన విశ్లేషకుడు ఒకరు వెల్లడించారు. ‘కఠిన లాక్డౌన్ వల్ల భారత్లో వ్యాపార నిర్వహణకు సంబంధించి ప్రపంచ మదుపర్లు, వ్యాపారులు, ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా సాంకేతికత రంగంలో. అందువల్ల వ్యాపారులు ఊపిరి పీల్చుకోవాలంటే కొన్ని నియమాలను సడలించాల్సిన అవసరం ఉంద’ని ఆయన అభిప్రాయపడ్డారు. ఆన్లైన్ విభాగ కార్యకలాపాలను క్రమక్రమంగా పునరుద్ధరిస్తే.. సకాలంలో వినియోగదార్లకు వస్తువులను చేరవేసేందుకు తయారీ సంస్థలు, దిగుమతిదార్లు, కార్మిక మంత్రిత్వ శాఖ, ఇతర వ్యవస్థలతో కలిసి ఇవి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. వివిధ సంస్థలతో భాగస్వామ్యాల ద్వారా, సమీప విక్రయ కేంద్రాల సాయంతో సరఫరాకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.