భారత్లో 2026 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య 33 కోట్లకు చేరే అవకాశం ఉందని ఎరిక్సన్ నివేదిక అంచనా వేసింది. ఒక్కో స్మార్ట్ఫోన్లో నెలవారీ సరాసరి డేటా వినియోగం కూడా ప్రస్తుత స్థాయి నుంచి మూడింతలై 40 జీబీకి చేరొచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో సరాసరిన నెలవారీ డేటా వినియోగం 14.6 జీబీగా ఉన్నట్లు పేర్కొంది.
భారత్లో 4జీ కనెక్షన్లు 2020లో 68 కోట్లు ఉండగా.. 2026 నాటికి 83 కోట్లకు చేరతాయని అంచనా వేసిది. 2026 ఆఖరుకు దేశంలోని మొబైల్ కనెక్షన్లలో సుమారు 26 శాతం 5జీ (33 కోట్లు) ఉంటాయని తెలిపింది. మొబైల్ ఫోన్ల వాటా 2020లో 72 శాతం ఉండగా.. 2026 నాటికి 98 శాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే 4జీ, 5జీల వృద్ధితో 3జీ నెట్వర్క్ సేవలు దశల వారీగా నిలిచిపోవచ్చని అంచనా వేసింది.
5జీ ట్రయల్స్ వేగవంతం..
దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా టెలికాం సంస్థలు ట్రయల్స్ ప్రక్రియను వేగవంతం చేశాయి. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఇప్పటికే గురుగ్రామ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో 5జీ ట్రయల్స్ ప్రారంభించింది. టెలికాం విభాగం (డాట్) నుంచి అనుమతులు లభించిన నెల రోజులకే ట్రయల్స్ చేపట్టింది ఎయిర్టెల్. దీనితో డాట్ నుంచి అనుమతి పొందిన సంస్థల్లో ట్రయల్స్ ప్రారంభించిన తొలి సంస్థగా ఎయిర్టెల్ నిలిచింది.
ట్రయల్స్లో 1జీబీ పర్ సెకన్ వేగంతో డేటా బదిలీ అయినట్లు ఎయిర్టెల్ తెలిపింది. త్వరలోనే ముంబయి, కోల్కతా, దిల్లీ సర్కిళ్లలో 5జీ ట్రయల్స్ చేపట్టనుంది ఈ సంస్థ.