ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లోని తప్పులు... రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం సృష్టించడం వల్ల ఉన్నత విద్యా మండలి అప్రమత్తమైంది. రాష్ట్రంలో సంప్రదాయ, ఇంజినీరింగ్ కోర్సులు, డిగ్రీ, పీజీ, ఇతర పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిపై సమీక్ష జరిపింది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు లింబాద్రి, వెంకట రమణ, రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డితో పాటు.. రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల ఉపకులపతులు సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఉపకులపతులతో కమిటీ..
గత మూడేళ్లుగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య.. ఉత్తీర్ణులవుతున్న వారి నిష్పత్తిని సమీక్షించారు. మళ్లీ మూల్యాంకనం చేయాలని యూనివర్సిటీల్లో ఎందరు దరఖాస్తు చేసుకుంటున్నారు? వారిలో ఎంతమంది మార్కులు మారుతున్నాయనే విషయాన్ని ప్రాథమికంగా పరిశీలించారు. ప్రస్తుత విధానాల్లో పలు లోపాలున్నాయని... కీలక మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. వీటిని అధ్యయనం చేసి సంస్కరణలు సిఫార్సు చేసేందుకు ముగ్గురు ఉపకులపతులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మగాంధీ యూనివర్సిటీల ఉపకులపతులతో కూడిన కమిటీ నెల రోజుల్లో పలు సూచనలతో నివేదిక ఇవ్వనుంది.