రేపు కేసీఆర్, జగన్ సమావేశం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రేపు కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ భేటీ కానున్నారు. గోదావరి జలాల పూర్తి స్థాయి సద్వినియోగమే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. గోదావరి వరద నీటిని 300 టీఎంసీల వరకు కృష్ణానదిలోకి తరలించే అంశంపై చర్చించనున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ.. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు ఎక్కువ నీటిని తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు.
కరవు తీరాలంటే మళ్లింపు తప్పదు...
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఇరువురి నేతల మధ్య గోదావరి జలాల వినియోగంపై చర్చ జరిగింది. ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని, అక్కణ్ణుంచి నేరుగా శ్రీశైలానికి నీటిని మళ్లించేందుకు అవకాశం ఉందని... పూర్తి సహకారంతో కరవు జిల్లాలకు గోదావరి వరద జలాలను వినియోగించుకోవచ్చని సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. కేసీఆర్ సూచనపై జగన్ సానుకూలంగా స్పందించారు. అందుకు అనుగుణంగా ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారులు, ఇంజినీర్లతో చర్చలు జరిపారు.
మూడు ప్రతిపాదనలు...!
గోదావరి జలాలు కృష్ణాకు తరలింపు కోసం మూడు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. మెుదటిది ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత ఆ నీటిని శ్రీశైలానికి మళ్లించడం. రెండోది దుమ్ముగూడెం నుంచి గోదావరి నీటిని నాగార్జునసాగర్కు మళ్లించి అక్కడి నుంచి శ్రీశైలానికి తరలించడం. మూడోది పోలవరం నుంచి గోదావరి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించి అక్కడి నుంచి నది ద్వారానే నాగార్జునసాగర్కు, అక్కణ్ణుంచి శ్రీశైలానికి నీరు తరలించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు.
నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. నీటిమట్టాన్ని 560 అడుగుల వరకూ నిర్వహిస్తే ఇందులో నిల్వ చేసిన నీటిని రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా శ్రీశైలంలోకి ఎత్తిపోయవచ్చు. ప్రస్తుతం విద్యుత్తు ఉత్పత్తి ద్వారా వదిలిన నీటిని తిరిగి శ్రీశైలంలోకి ఎత్తిపోసే వ్యవస్థ ఉంది. దీనినే వినియోగించుకొని నీటి ఎత్తిపోత చేపట్టడానికి అవకాశం ఉందనే అభిప్రాయంతో రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ వర్గాలు ఉన్నాయి. గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించడం కంటే నాగార్జున సాగర్ కు తరలించి... అక్కణ్ణుంచి శ్రీశైలానికి తరలించడమే ప్రయోజనమన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ విషయాలన్నింటి పైనా రేపటి సమావేశంలో పూర్తి స్థాయిలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఇద్దరు సీఎంలతో పాటు ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సమావేశంలో పాల్గోనున్నారు. నదీ జలాల అంశంతో పాటు విద్యుత్ ఉద్యోగుల విభజన, బకాయిలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలో సంస్థల విభజన తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చూడండి:కొత్త అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాలకు శంకుస్థాపన