తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 5:34 AM IST

Updated : Dec 18, 2019, 7:01 AM IST

ETV Bharat / briefs

నేడే జీఎస్టీ మండలి 38వ సమావేశం.. అంచనాలు ఇవే!

జీఎస్టీ మండలి 38వ సమావేశం నేడు జరగనుంది. ప్రభుత్వ లక్ష్యానికన్నా తక్కువగా జీఎస్టీ వసూలవడం సహా.. ఇతర పరిణామాల మధ్య ఇవాళ జరగనున్న మండలి సమావేశం కీలకంగా మారింది. జీఎస్టీ రేట్ల పెంపు సహా పన్ను వసూళ్ల వృద్ధి వంటి కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశముంది.

gst
నేడే జీఎస్టీ మండలి 38వ సమావేశం.. అంచనాలు ఇవే!

దేశవ్యాప్తంగా ఊహించిన దానికన్నా తక్కువ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రావడం, రాష్ట్రాలకు నష్టపరిహారాల చెల్లింపులో ఆలస్యం.. వీటికి గల కారణాలపై సమీక్షించేందుకు జీఎస్టీ మండలి నేడు సమావేశంకానుంది. మొత్తం మీది ఇది 38వ భేటీకానుంది. వివిధ వస్తువులపై జీఎస్టీ వడ్డింపు, ఆదాయాన్ని పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలపై పలు సూచనలు, సలహాలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్‌ ఇప్పటికే రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే.

పన్నులు వద్దని...

దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా నూతనంగా ఎలాంటి పన్నులు, సుంకాలు విధించకూడదంటూ బంగాల్​ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే జీఎస్టీ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేశాయి. దీనిపై బంగాల్​ ఆర్థిక మంత్రి జీఎస్‌టీ కౌన్సిల్‌కు లేఖ రాశారు.ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) ఏప్రిల్​-నవంబర్​ కాలానికి గాను రూ.5,28,365 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు వస్తాయని.. బడ్జెట్​ ప్రవేశపెట్టే సమయంలో కేంద్రం అంచనా వేసింది. కానీ ఈసారి ప్రభుత్వం అంచనా కన్నా చాలా తక్కువ జీఎస్టీ వసూళ్లు(రూ.5,26,000 కోట్లు) నమోదయ్యాయి.

జీఎస్టీ వసూళ్ల లక్ష్యం పెంపు..

ఈ ఆర్థిక సంవత్సరం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల క్షీణతపై ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను మిగిలిన నాలుగు నెలల్లో రూ.1.1లక్షల కోట్ల చొప్పున జీఎస్టీ వసూలు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించినట్లు సమాచారం.ఈ మేరకు పన్నులశాఖ అధికారులతో ఆదాయ కార్యదర్శి అజయ్ భూషణ్​ పాండే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవాలని సూచించినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: యూపీ అసెంబ్లీలో భాజపా ఎమ్మెల్యేకు విపక్షాల మద్దతు

Last Updated : Dec 18, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details