యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని సామాజిక ఆసుపత్రిలో వయోవృద్ధుల ఆరోగ్యసంరక్షణ కార్యక్రమం చేపట్టారు. ఆరోగ్యకేంద్రాలకు రాలేనివారి కోసం వైద్యసిబ్బంది ఇంటికి వెళ్లి సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం ప్యాలియేటివ్ కేంద్రాలు, 104 సంచార వాహనాలు, ఆరోగ్య ఉపకేంద్రాలను వినియోగిస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ఈ తరహా సేవలు మొదలుపెట్టారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సేకరించిన సమాచారం ఆధారంగా వైద్యాధికారులు అవసరమైన వారికి పరీక్షలు చేసి ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు.
నెలకోసారి పరీక్ష..
ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రతీ గురువారం వయోవృద్ధులకు ప్రత్యేకంగా పరీక్షలు చేస్తున్నారు. ఆసుపత్రికి రాలేని వారికి ఆరోగ్య కార్యకర్త, 104 సిబ్బంది ఫిజియోథెరపిస్టు, ఫార్మసిస్టు బృందం కనీసం నెలకు ఒకసారి వెళ్లి సేవలందించే ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే 600 మందికి పైగా చికిత్స...
ఇప్పటివరకు 600 మందికి పైగా పరీక్షలు నిర్వహించి.. వైద్యసేవలు అందించామని చౌటుప్పల్ పాలియేటివ్ కేంద్రం ఇంఛార్జీ డాక్టర్ కాటంరాజు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రిలో చేర్చి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.