రాకాసి మిడతల దండు ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో భారీగా వాటిని సంహరించటం వల్ల... మిగిలిన దండు దిశ కూడా మార్చుకుందని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల క్రితం వరకు రాష్ట్ర సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలో రాంటెక్ ప్రాంతం వరకు మిడతలదండు వచ్చింది. దండు దక్షిణం వైపు వస్తే సరిహద్దు జిల్లాలపై ఆ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు.
రాష్టంపై మిడతల దండు ప్రభావం ఉండకపోవచ్చు...! - Locusts direction to telangana
తెలంగాణపై మిడతల ప్రభావం ఉండకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల క్రితం వరకు రాష్ట్ర సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరం వరకు దండు రాగా... ఆ ప్రాంతంలో డ్రోన్ల సాయంతో సంహరిస్తున్నారు. ఈ చర్యతో... మిడతల దండు తన దిశ మార్చుకునే అవకాశం ఉందని అధికారులు ఆశిస్తున్నారు.
![రాష్టంపై మిడతల దండు ప్రభావం ఉండకపోవచ్చు...! No impact of Locusts on telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:45-tg-hyd-10-12-locusts-av-3053262-12062020092405-1206f-1591934045-727.jpg)
మహారాష్ట్రలో మిడతలను భారీగా సంహరించగా... పరిమాణం బాగా తగ్గింది. ప్రస్తుతం ఈ రాకాసి దండు మహారాష్ట్రలోని భండారా జిల్లా మొహది ప్రాంతంలో ఉంది. అక్కడ వాటిని సంహరించేందుకు డ్రోన్ల సహాయంతో డెల్టామెత్రిన్ రసాయనాన్ని భారీగా పిచికారీ చేస్తున్నారు. ఈ చర్యతో దండు పరిమాణం ఇంకా తగ్గుతుందని ఆశిస్తున్నారు.
ఇదే సమయంలో దండు దిశ కూడా దక్షిణం వైపు కాకుండా ఛత్తీస్ ఘడ్ వైపు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు... సరిహద్దు జిల్లాలను పూర్తిగా అప్రమత్తం చేశారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని నిర్దేశిస్తున్నారు.