తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జల వివాదాలపై చర్చించనున్న కేసీఆర్​, జగన్

ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే రెండు రాష్ట్రాలకూ... ప్రయోజనాలుంటాయనే అభిప్రాయంతో ఉన్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్​తో జల వివాదాలపై చర్చించేందుకు కేసీఆర్​ నిర్ణయించారు​. సుప్రీం కోర్టు దాకా వెళ్లిన నీటి అంశాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సుముఖత చూపిస్తున్నారు.

By

Published : Jun 22, 2019, 6:14 AM IST

Updated : Jun 22, 2019, 8:23 AM IST

KCR-JAGAN MEETING ON WATER ISSUE

కూర్చొని మాట్లాడుకుంటే సరి...

జల వివాదాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్​, జగన్​లు ఈ నెల 27న సమావేశం కావాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశం అమరావతిలో ఏర్పాటు చేయాలని అనుకొన్నా... ఎక్కడ, ఎన్ని గంటలకనేది ఇంకా ఖరారు కావాల్సి ఉందని నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇరు రాష్ట్రాల అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. బ్రిజేష్​కుమార్​ ట్రైబ్యునల్​, కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇద్దరు సీఎంలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో జల వివాదాలు పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతాయనే అభిప్రాయంతో ఉన్నారు.

కూర్చొని మాట్లాడుకుంటే సరి...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు బచావత్​ ట్రైబ్యునల్​ 811 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్​ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకొంటున్నాయి. పునర్విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కను నిర్ధారించారు. ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నది ట్రైబ్యునల్​ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రైబ్యునల్​ ఎదుట వాదనలకు భారీగా ఖర్చవుతుంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్​ రెండున్నర రెట్లు ఎక్కువగా ఖర్చు చేసింది. బచావత్​ ట్రైబ్యునల్​లోనే అన్యాయం జరిగిందని... సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేసింది తెలంగాణ. వీటన్నింటిపై చర్చించుకొని రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చి విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తే అదే ట్రైబ్యునల్​ తీర్పులోనూ వచ్చే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరు, అసలు ఈ బోర్డుల అవసరం ఉందా అనే అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: పెళ్లైన రెండో రోజే... పందిట్లో నలుగురు మృతి

Last Updated : Jun 22, 2019, 8:23 AM IST

ABOUT THE AUTHOR

...view details