తెలంగాణ

telangana

By

Published : Jun 19, 2019, 9:43 PM IST

ETV Bharat / briefs

'మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి'

రాష్ట్రానికి తెరాస శ్రీరామరక్షగా... ప్రజలు భావిస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు నిరంతర ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున గ్రామ గ్రామాన పండుగ వాతావరణం ప్రతిబింబించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని దిశా నిర్దేశం చేశారు.

kcr

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యద్భుతం

తెలంగాణ రాష్ట్ర సమితి పట్ల ప్రజలు చూపిస్తున్న విశ్వాసం చిరస్మరణీయమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్​లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెరాసనే తెలంగాణ సమాజానికి శ్రీరామరక్షగా ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. కొద్ది మందితో రాష్ట్ర సాధన కోసం 2001లో మొదలైన తెరాస ప్రస్తానం... ప్రస్తుతం ఇంటింటికీ చేరిందన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు తనతో పాటు... పార్టీ కార్యకర్తలందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

రైతులతో సంబురాలు జరపుకోండి

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విద్యుత్తు, తాగునీరు సమస్య పరిష్కారమై పోయిందని... కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలకు తెరపడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యద్భుతమన్నారు. పరిస్థితుల కారణంగా ప్రారంభోత్సవానికి పార్టీ నేతలను తీసుకెళ్లలేక పోతున్నట్లు వివరించారు. పార్టీ శ్రేణులు తమ తమ గ్రామల్లోనే రైతులు, స్థానికులతో కలిసి సంబురాలు జరుపుకోవాలని కేసీఆర్ చెప్పారు.

కష్టపడ్డవారికి అవకాశాలు

పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస శ్రేణులు చక్కగా పనిచేశాయని, దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయని కేసీఆర్ అభినందించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లుగా ఎన్నికైన రాష్ట్ర కమిటీ సభ్యులను కేసీఆర్ అభినందించారు. పార్టీలో కష్టపడ్డ వారందరికీ తప్పకుండా అవకాశాలు ఉంటాయన్నారు. త్వరలోనే మున్సిపాల్టీ ఎన్నికలు ఉంటాయని.. కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. పార్టీ సభ్వత్వ నమోదు, జిల్లా కార్యాలయాల నిర్మాణ ప్రక్రియలో పార్టీ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'రాష్ట్రాల బలోపేతంతోనే దేశాభివృద్ధి'

ABOUT THE AUTHOR

...view details