దర్శకత్వం చేపట్టిన తొలి చిత్రానికే జాతీయ అవార్డులు దక్కడం తెలుగు చలన చరిత్రలో ఒక రికార్డే. ఆ రికార్డులు అందించిన ఘనత కొల్లి ప్రత్యగాత్మదే. ‘భార్యాభర్తలు’ సినిమాతో పూర్తి స్థాయి దర్శకునిగా ఎదిగిన ప్రత్యగాత్మ... ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు.
ఛాయా చిత్ర సంస్థ నిర్మాత కె.సుబ్బరాజు ప్రత్యగాత్మతో ‘మంచి మనిషి’ చిత్రం నిర్మిస్తున్నప్పుడు నటుడు కృష్ణంరాజు పరిచయం జరిగింది. ‘ఆత్మా ఆర్ట్స్’ పేరిట ప్రత్యగాత్మ ఒక స్వంత నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి చిత్రం ‘చిలకా గోరింకా’ నిర్మించారు. అందులో కృష్ణంరాజును హీరోగా పరిచయం చేశారు. నటుడు పద్మనాభం నిర్మించిన ‘దేవత’, ఎ.పూర్ణచంద్రరావు నిర్మించిన ‘ఆడపడుచు’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కె.హేమాంబరధరరావు ప్రత్యగాత్మకు తమ్ముడే.
రెబల్స్టార్కు తొలి చిత్రం...
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సంపన్న కుటుంబంలో పుట్టిన కృష్ణంరాజు హైదరాబాదు బద్రుకా కళాశాలలో కామర్స్ పట్టభడ్రుడు. ‘బావమరదళ్లు’ సినిమా నిర్మించిన పద్మనాభరావు ప్రోత్సాహంతో 1963లో కృష్ణంరాజు మద్రాసు చేరుకున్నారు. అక్కడే ప్రత్యగాత్మ కృష్ణంరాజుకు స్క్రీన్ టెస్టు నిర్వహించి తాను తీయబోయే కొత్త సినిమాలో అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారు.
నాటకరంగ అనుభవం ఉంటే మంచిదని ఈలోగా నాటకాలలో నటిస్తూ ఉండమని సలహా ఇవ్వడంతో, ‘నాగమల్లి’, ‘పరివర్తన’ వంటి నాటకాల్లో నటించి అనుభవం గడించారు. ‘మంచి మనిషి’ సినిమా షూటింగులకు హాజరవుతూ నటనలోని మెళకువలు గ్రహించారు. 1965 ఆగస్టు 6న ప్రత్యగాత్మ సొంత చిత్రం ‘చిలకాగోరింకా’ సినిమా షూటింగు మొదలైంది. అందులో సీనియర్ నటి కృష్ణకుమారి సరసన కృష్ణంరాజును ప్రత్యగాత్మ హీరోగా పరిచయం చేశారు.
కథలోకి వెళితే..
అరవై ఏళ్లు నిండిన సంజీవరావు (ఎస్.వి.రంగారావు), శాంత (అంజలీదేవి) చిలకాగోరింకల్లా అన్యోన్యమైన దంపతులు. ముప్పై ఏళ్ల దాంపత్య జీవితాన్ని సంజీవరావుకు స్మృతిగా మిగిల్చి, ఒక పాపకు జన్మనిచ్చి, శాంత శాశ్వతంగా నిష్క్రమించింది. లోకం దృష్టిలో శాంత మరణించిందేమోకాని, సంజీవరావుకు మాత్రం ఆమె తన హృదయంలో పదిలంగానే ఉంది. రాజా (కృష్ణంరాజు), పాపారావు (రమణారెడ్డి) అనే బాగా డబ్బున్న షావుకారు కొడుకు. శశి (రమాప్రభ) అతని కూతురు. సాగరయ్య (పినిసెట్టి) కొడుకు భద్రం (పద్మనాభం) ఆమెను ప్రేమిస్తాడు. మరోవైపు రాజా, ఉష (కృష్ణకుమారి)ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తండ్రి మాత్రం డబ్బుతోనే లోకాన్ని చూసే వ్యక్తి. ఎలాగైనా తండ్రిని అంగీకరింపజేసి ఉషను తనదాన్ని చేసుకోవాలని రాజా కలలు కంటాడు.
ఉష అందమైన నడత ఉన్న పిల్ల. తల్లికి ఆలంబనగా ఉండాలనేది ఆమె ఆశయం. ఆమె రాజాను మనస్ఫూర్తిగా ప్రేమించింది. కానీ విధి ఎదురుతిరిగి ఆమెను అవిటిదాన్ని చేసింది. నడకలేని తాను రాజాకు కనిపించకూడదనే ఉద్దేశంతో ఉష దూరంగా వెళ్లి తనకు తానుగా అజ్ఞాతం విధించుకుంది. సంజీవరావు ఆశ్రయం పొంది అతనికి, అతని కూతరుకి తనే సర్వస్వమై సేవలు చేసేందుకు సిద్ధపడింది. సంజీవరావు పంచన చేరిన ఉషను రాజా అపార్థం చేసుకొంటాడు. డబ్బుకోసమే ఉష సంజీరావు పంచన చేరిందని భ్రమించాడు.
ఆ సమయం లోనే రాజా బతుకులోకి సరస (వాసంతి) ప్రవేశించాలని ప్రయత్నించింది. కానీ రాజా ఉషని తప్ప వేరెవరినీ ప్రేమించలేడు. అతని నిస్వార్థ ప్రేమ ముందు సరస నిలువలేకపోయింది. మంచి మనసుతో సరస, రాజాకు ఉష మీదవున్న దురభిప్రాయాన్ని తుడిచివేయగలిగింది. ఆమె సహకారంతో నిజం తెలుసుకున్న రాజా, అవిటిదైనా ఉషను స్వీకరించేందకు ముందుకొచ్చాడు. చివరికి సినిమా సుఖాంతం.
సాలూరివారి స్వరాలు...
‘చిలాకా గోరింకా’ సినిమాకు సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరావు. ఇందులో మూడు పద్యాలు, ఏడు పాటలున్నాయి. వాటినన్నింటినీ రాసింది మహాకవి శ్రీశ్రీ కావడం విశేషం. పద్యాలను మాధవపెద్ది సత్యం ఆలపించారు. పాటల్లో ముఖ్యమైంది ఘంటసాల ఆలపించిన ‘నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే’ అనే మలయమారుత రాగ ఛాయల్లో స్వరపరచిన గీతం. షష్టిపూర్తి జరుపుకున్న ఎస్.వి.రంగారావు పడకగదిలో అంజలీదేవిని ఉద్దేశిస్తూ పాడే పాట ఇది. ‘పడకింటి శయ్యచెంత నీ మేను తాకినంత... మన గీతాలలో జలపాతాలలో నవరాగాలు మ్రోగెనులే’ అంటూ శృంగార రసాన్ని బంగారంగా పండించిన శ్రీశ్రీ అభినందనీయుడు. ఎస్.వి.రాంగారావు, కృష్ణకుమారి, బేబీ కౌసల్య మీద చిత్రీకరించిన ‘పాపా కథ విను బాగా విను విను’ పాటను ఘంటసాల, సుశీల ఆలపించారు. ఇందులో శ్రీశ్రీ ప్రయోగించిన ‘బుజబుజ రేకుల గొరవంకా బుజ్జా రేకుల చిలకా- మనసు కలియంగా జతగా హాయిగా నిలువంగా’ చరణం తమాషాగా ఉంటుంది.