ఈరోజుల్లో చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ సోషల్ మీడియా జపం చేస్తున్నవారే. సెల్ఫీ దిగడం, స్టేటస్ పెట్టేయడం, వీడియో తీయడం-వైరల్ చేసేయడం అలవాటుగా మారింది. సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలూ అంతే. తమ చిత్రాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఇదొక వేదికైంది. ప్రస్తుతం దర్శకనిర్మాతలు, నటీనటులు సామాజిక మాధ్యమాలతోనే అభిమానులకు దగ్గరవుతున్నారు. అలాంటిది టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఇప్పటికీ ఈ మీడియాను ఉపయోగించడు.
తాజాగా 'అల వైకుంఠపుములో' చిత్ర ప్రచార కార్యక్రమానికి హాజరైన త్రివిక్రమ్ను ఓ విలేకరి ఇదే ప్రశ్న అడగ్గా స్పందించాడీ మాటల మాంత్రికుడు. "రెండు కారణాల వల్ల నేను సోషల్ మీడియా వాడను. మొదటిది నాకు వాడటం రాదు. రెండు బద్ధకం. నా ఫోన్ ఎక్కడుంటుందో నాకే తెలీదు. అయినా ఈ వయసులో నాకు దాంతో పనేం ఉంది" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు త్రివిక్రమ్.