దిల్లీలో మరో అగ్నిప్రమాదం - పేపర్ మిల్లు దగ్ధం దిల్లీలో వరుసగా మూడో రోజూ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నరైనా పారిశ్రామికవాడలోని ఓ పేపర్ కార్డ్ పరిశ్రమలో ఇవాళ ఉదయం మంటలు చెలరేగాయి. తక్షణం స్పందించిన అగ్నిమాపకశాఖ 29 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరట కలిగిస్తోంది.
మంగళవారం దిల్లీ కరోల్బాగ్లోని ఓ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. బుధవారం పశ్చిమపురి ప్రాంతంలో చెలరేగిన మంటలు 250 గుడిసెలను ఆహుతి చేశాయి. దీంతో వరుస అగ్నిప్రమాదాలతో దిల్లీవాసులు బెంబేలెత్తిపోతున్నారు.