తెలంగాణ

telangana

ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్​

By

Published : Apr 15, 2019, 5:55 AM IST

Updated : Apr 15, 2019, 11:31 AM IST

పార్టీ వీడి అధికార తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ చర్యలు తీసుకునే దిశలో ముందుకు వెళుతోంది. ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. మరో నలుగురిపై త్వరలో ఫిర్యాదు చేసేందుకు రాష్ట్ర నాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది.

అనర్హత వేటు పిటిషన్​

అనర్హత వేటు పిటిషన్​

పార్టీని వీడి తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించి... ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలకు కాంగ్రెస్‌ ఆచితూచి ముందుకు వెళ్తోంది. అధికార తెరాసలో చేరనున్నట్లు ప్రకటించిన వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని, స్పీకర్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నలతో రోజు రోజుకు రాష్ట్ర కాంగ్రెస్​ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. ఇన్ని రోజులు పార్లమెంటు ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్న రాష్ట్ర నాయకత్వం.. ఎన్నికలు పూర్తవగానే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే ప్రక్రియను చేపట్టింది.

సభాపతిని కలిసిన సీఎల్పీ నేత

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా స్పీకర్‌ తప్పనిసరిగా అసెంబ్లీకి వస్తారని భావించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరుగురు ఎమ్మెల్యేలకు చెందిన పిటిషన్లు సిద్ధం చేశారు. సభాపతిని కలిసి ఆ శాసనసభ్యులపై ఫిర్యాదు చేశారు. ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డిలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

త్వరలో మరో నలుగురిపై పిటిషన్​

ఈ ఎమ్మెల్యేలు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలు... టీవీల్లో వచ్చిన కథనాలతో పాటు గతంలో వీరు పత్రికా ముఖంగా చేసిన వ్యాఖ్యలను కూడా ఫిర్యాదులో పొందుపరచినట్లు తెలుస్తోంది. అనర్హత పిటిషన్ వేసేందుకు వీలుగా వివిధ కోణాల్లో అవసరమైన పూర్తి ఆధారాలను సేకరించిన కాంగ్రెస్‌, పిటిషన్లతోపాటు వాటిని కూడా పొందుపరచి ఫిర్యాదు చేశారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్‌, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్​ రెడ్డిలపై కూడా త్వరలో ఫిర్యాదులు చేయనున్నట్లు ప్రకటించారు. ఆధారాలు సేకరించే విషయంలో కొంత సమయం పట్టడం వల్లనే ఆ నలుగురిపై ఫిర్యాదు చేయడంలో ఆలస్యమవుతున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఇవీ చూడండి: గవర్నర్​ను కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్

Last Updated : Apr 15, 2019, 11:31 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details